కేటీఆర్ ఏపీకొస్తే.. అభివృద్ధి చూపిస్తాం, మీ ఫ్రెండ్ కూడా వస్తే మంచిది.. : ఆర్.కె.రోజా

Published : Apr 30, 2022, 10:25 AM IST
కేటీఆర్ ఏపీకొస్తే.. అభివృద్ధి చూపిస్తాం, మీ ఫ్రెండ్ కూడా వస్తే మంచిది.. : ఆర్.కె.రోజా

సారాంశం

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మీద కేటీఆర్ క్రెడాయ్ వేదికగా చేసిన కామెంట్స్ ను మినిస్టర్ ఆర్.కె.రోజా ఖండించారు. కేటీఆర్ కు ఆయన ఫ్రెండ్ చెప్పింది తప్పు అన్నారు. 

హైదరాబాద్ : Andhra Pradeshలో రోడ్ల పరిస్థితిపై తెలంగాణ మంత్రి KTR చేసిన వ్యాఖ్యలపై ఏపీ పర్యాటక శాఖ మంత్రి R. K. Roja స్పందించారు. CM KCR కలిసిన తర్వాత ప్రగతి భవన్ వద్ద మీడియాతో మాట్లాడారు. పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మర్యాదపూర్వకంగా సీఎం కేసీఆర్ ను కలిసి ఆశీర్వాదం తీసుకున్నట్లు తెలిపారు. ఏపీ విషయంలో మంత్రి కేటీఆర్ ను ఎవరో తప్పుదోవ పట్టించారని అర్థమవుతోందన్నారు. కేటీఆర్ మాట్లాడుతూ…  పొరుగు రాష్ట్రాలు అన్నారు.. ఆంధ్రప్రదేశ్ అనలేదు.. ఒకవేళ ఏపీ గురించి అని ఉంటే తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. కేటీఆర్ ను ఆంధ్రప్రదేశ్ కు సాదరంగా ఆహ్వానిస్తున్నాం అని,  కేటీఆర్ తో పాటు ఆయనకు చెప్పిన ఫ్రెండ్ కూడా వస్తే ఏపీలో జరుగుతున్న అభివృద్ధిని దగ్గరుండి చూపిస్తానని రోజా చెప్పారు.

‘ఏపీ పథకాలను ఇతర రాష్ట్రాల్లోనూ అమలు చేస్తున్నారు.  నాడు-నేడు కింద బడులు, ఆస్పత్రిలో ఎలా అభివృద్ధి చేశామో చూపిస్తాం. భారీ వర్షాల కారణంగా రోడ్లు దెబ్బతిన్నాయి. కరోనా తర్వాత రాష్ట్రంలో తొమ్మిదివేల కిలోమీటర్ల అంతర్గత రహదారులు ఏ విధంగా వేస్తున్నారో చూపిస్తాం. కేంద్రంతో కలిసి జాతీయ రహదారుల నిర్మాణం ఎలా జరిగిందో వివరిస్తాం.  అవినీతికి తావులేకుండా వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రభుత్వ పథకాలను నేరుగా లబ్ధిదారులకు అందిస్తున్న తీరును మంత్రి కేటీఆర్ కు చూపిస్తాం. ఆయన కూడా స్ఫూర్తి పొంది తెలంగాణ లో కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలనుకునే విధంగా తెలుసుకుంటారు. మంత్రిని మిస్ గైడ్ చేస్తూ ఫ్రెండ్ చెప్పింది కూడా తప్పని కేటీఆర్ తెలుసుకుంటారని భావిస్తున్నా. కేటీఆర్  తేదీ, సమయం ఇస్తే.. పర్యాటక శాఖ మంత్రిగా  రాష్ట్రమంతా తిరిగి చూపిస్తా’ అని రోజా తెలిపారు. 

ఇదిలా ఉండగా, తాను ఈ రోజు ఇక్కడ credai సమావేశంలో అన్యాపదేశంగా చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్లోని నా స్నేహితులకు తెలియకుండానే కొంత బాధ కలిగించి ఉండొచ్చు అని మంత్రి KTR పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యల వెనుక ఎలాంటి దురుద్దేశం లేదని, ఎవరినో బాధపెట్టాలనో, కించపరచాలనో అలా మాట్లాడలేదు అని వివరించారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి 12 గంటల సమయంలో tweet చేశారు. ‘నేను ఏపీ సీఎం  YS Jaganను సోదర సమానుడిగా భావిస్తున్నా. ఆయన నాయకత్వంలో ఆ రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలని మనసారా కోరుకుంటున్నా’  అని ఆయన పేర్కొన్నారు.

కాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి అని తనకు కొందరు చెప్పారని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ శుక్రవారం అన్నారు. దేశంలోని అన్ని నగరాల్లో కెల్లా హైదరాబాదే అత్యుత్తమ నగరంగా ఆయన పేర్కొన్నారు.  శుక్రవారం నాడు హైదరాబాద్ లో జరిగిన క్రెడాయ్ 11వ వార్షికోత్సవంలో ముఖ్యఅతిథిగా కేటీఆర్ పాల్గొన్నారు.  ఆంధ్రప్రదేశ్లో roads, ఎలక్ట్రిసిటీ, డ్రింకింగ్ వాటర్ కూడా లేవని తనకు కొందరు మిత్రులు చెప్పారన్నారు. అనుమానం ఉంటే  ఎవరైనా పక్క రాష్ట్రానికి కార్లు వేసుకొని వెళ్లి రావాలన్నారు కేటీఆర్. పక్క రాష్ట్రానికి  పోయివచ్చిన తర్వాతే మన రాష్ట్రంలో  పరిస్థితులు ఎంత బాగున్నాయో  తెలుస్తుందని కేటీఆర్ చెప్పారు.  

PREV
click me!

Recommended Stories

చంద్రబాబు మాట్లాడుతుండగా సొమ్మసిల్లి పడిపోయిన కమాండో | Commando Collapses | Asianet News Telugu
Miss India 2020 Manasa Varanasi Visit Tirumala:తిరుమలలో మిస్ ఇండియామానస వ‌రణాసి| Asianet News Telugu