మెున్న సొంతపుత్రుడు, నిన్న దత్తపుత్రుడు, నేడు చంద్రబాబు: మంత్రి పెద్దిరెడ్డి ఫైర్

By Nagaraju penumalaFirst Published Nov 14, 2019, 10:31 AM IST
Highlights


చంద్రబాబు సొంత పుత్రుడు నారా లోకేష్, దత్తపుత్రుడు  పవన్ కళ్యాణ్ తో దొంగ దీక్షలు చేయించి ఇప్పుడు ఆయనే ఇసుక దీక్ష చేస్తున్నారంటూ తిట్టిపోశారు. గత ఐదేళ్లలో ఇసుక మాఫియా చెలరేగిపోయిందని ఆరోపించారు. 

విజయవాడ: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తలపెట్టిన ఇసుక దీక్షపై ఆగ్రహం వ్యక్తం చేశారు పంచాయితీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అధికారంలో ఉన్నప్పుడు ఇసుక మాఫియాకు పాల్పడిన చంద్రబాబు ఇప్పుడు దొంగ దీక్షలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. 

చంద్రబాబు సొంత పుత్రుడు నారా లోకేష్, దత్తపుత్రుడు  పవన్ కళ్యాణ్ తో దొంగ దీక్షలు చేయించి ఇప్పుడు ఆయనే ఇసుక దీక్ష చేస్తున్నారంటూ తిట్టిపోశారు. గత ఐదేళ్లలో ఇసుక మాఫియా చెలరేగిపోయిందని ఆరోపించారు. 

బందరులో మాజీమంత్రి పార్థసారథి చేపట్టిన దీక్షకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంఘీభావం ప్రకటించారు. వైసీపీ ప్రభుత్వంలో ఎక్కడా ఇసుక మాఫియా అనేది జరగడం లేదన్నారు.  

చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న ఐదు సంవత్సరాల్లో వైసీపి నాయకులకు దీక్షలు చేయకుండా అక్రమ అరెస్టులు చేయించారని ఆరోపించారు. 

ఇసుక వల్లే తెలుగుదేశం పార్టీ కనుమరుగు అయ్యిందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. అయితే ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఇసుక దోపిడీకి చెక్ పెడుతూ ఇసుక కొత్త పాలసీని తీసుకురావడం జరిగిందన్నారు. 

చిన్న రోడ్లు మరియు పెద్ద రోడ్లలో రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక అక్రమ రవాణా జరగకుండా ఉండడానికి 150 నుండి 200 వరకు ప్రత్యేకమైన చెక్ పోస్టులను ఏర్పాటు చేసినట్లు చెప్పుకొచ్చారు.  అంతేకాకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 

ఇసుక అక్రమ రవాణా గాని అక్రమంగా ఇసుకను నిల్వ ఉంచిన వారికి 2 లక్షల రూపాయల జరిమానాతో పాటు రెండు సంవత్సరాల జైలు శిక్ష తప్పదని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి  హెచ్చరించారు.

ఇకపోతే ఇప్పుడే నదులలో వరద ప్రభావం తగ్గిందని చెప్పుకొచ్చారు. రెండు రోజుల్లో 2లక్షల టన్నుల ఇసుకను తీస్తామని తెలిపారు. ఇకపై ఇసుక కొరత అనేది ఉండకుండా ఉండేందుకు జగన్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. 

రాష్ట్రంలో ఇసుక కొరతను నిరసిస్తూ విజయవాడలోని అలంకార్ సెంటర్ సమీపంలో తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు 12 గంటల నిరసన దీక్షకు దిగారు. ఉదయం 8 గంటలకు చంద్రబాబు దీక్ష చేపట్టారు. ఈ దీక్ష రాత్రి 8 గంటల వరకు కొనసాగనుంది. 

ఈ వార్తలు కూడా చదవండి

ఇసుక కోసం దీక్ష... చంద్రబాబుకి వేదపండితుల స్వాగతం

ఇసుక కొరత: విజయవాడలో 12 గంటల దీక్షను ప్రారంభించిన చంద్రబాబు

click me!