చంద్రబాబునాయుడును విమర్శిస్తే ప్రత్యేక హోదా వస్తోందా అని ఏపీ రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. వైసీపీ బంద్ విఫలమైందని ఆయన ఆరోపించారు
తిరుపతి: చంద్రబాబునాయుడును విమర్శిస్తే ప్రత్యేక హోదా వస్తోందా అని ఏపీ రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. వైసీపీ బంద్ విఫలమైందని ఆయన ఆరోపించారు. ఏపీకి నష్టం చేసిన మోడీపై ఎందుకు విమర్శలు చేయడం లేదని ఆయన విపక్షాలను ప్రశ్నించారు.
మంగళవారం నాడు తిరుపతిలో సప్తగిరి బస్సులను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజల మద్దతు లేని కారణంగా వైసీపీ బంద్ విఫలమైందన్నారు. తన ఉనికి కోసమే ఇవాళ ఏపీ బంద్ కు జగన్ పిలుపునిచ్చారని అచ్చెన్నాయుడు చెప్పారు.
బంద్ సందర్భంగా మోడీని ఎందుకు విమర్శించలేదని ఆయన వైసీపీ నేతలను ప్రశ్నించారు. రోజుకో మాటతో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పబ్బం గడుపుతున్నారని మంత్రి విమర్శించారు.
నాలుగేళ్లపాటు కలిసి ఉన్న సమయంలో రాజ్యసభ సీటు గురించి ఎందుకు గుర్తుకు రాలేదని ఆయన ప్రశ్నించారు. ఏపీ రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంపై పోరాటానికి కలిసి రావాలని విపక్షాలను మంత్రి అచ్చెన్నాయుడు కోరారు.