గోరంట్ల మాధవ్ వీడియో కేసు.. సీఐడీకి చుక్కెదురు, తదుపరి చర్యలపై హైకోర్ట్ స్టే

By Siva KodatiFirst Published Sep 15, 2022, 6:48 PM IST
Highlights

హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో కాల్ వ్యవహారంపై తదుపరి చర్యలను నిలిపివేస్తూ ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తన పేరును ఈ కేసులో చేర్చడాన్ని సవాల్ చేస్తూ టీడీపీ నేత చింతకాయల విజయ్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. 
 

వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో కాల్ వ్యవహారంపై తదుపరి చర్యలను నిలిపివేస్తూ ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు తదుపరి చర్యలను నిలిపివేస్తూ హైకోర్టు స్టే ఇచ్చింది. కాగా.. ఓ మార్ఫింగ్ వీడియోతో తన గౌరవ మర్యాదలకు భంగం కలిగిస్తున్నారంటూ గోరంట్ల మాధవ్ ఏపీ సీఐడీకి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీనిని పరిగణనలోనికి తీసుకున్న సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు. అంతేకాదు పలువురు టీడీపీ నేతలను కూడా ఎఫ్ఐఆర్‌లో చేర్చారు. అయితే ఈ కేసును కొట్టివేయాలంటూ టీడీపీ నేత చింతకాయల విజయ్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై గురువారం విచారణ జరిపిన న్యాయస్థానం గోరంట్ల కేసులో తదుపరి చర్యలను నిలిపివేయాలంటూ సీఐడీని ఆదేశించింది. 

మరోవైపు..  మాధవ్ మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యవహారంపై రాష్ట్రానికి చెందిన డిగ్నిటీ ఫర్ వుమెన్ జేఏసీ నేతలు ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగ్ దీప్ ధన్ ఖడ్ తో పాటు జాతీయ మహిళా కమిషన్, పలువురు కేంద్ర మంత్రులను కలిసి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.  రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకి మహిళా నేతలు ఇచ్చిన ఫిర్యాదు విషయంలో ఆమె కార్యాలయం తాజాగా స్పందించింది. ఈ నెల 23న మహిళా జేఏసీ నేతలంతా కలిసి రాష్ట్రపతిని కలిసి ఫిర్యాదు చేశారని.. ఆ కాపీని ఏపీ సిఎస్ కు పంపి ఈ వ్యవహారంలో తగిన చర్యలు తీసుకోవాలని సూచించినట్లు లేఖలో పేర్కొంది. ఈ మేరకు మహిళా జేఏసీ కన్వీనర్ చెన్నుపాటి కీర్తికి  సమాచారం ఇస్తూ రాష్ట్రపతి కార్యాలయం  లెటర్ పంపించింది. గోరంట్ల మాధవ్ నగ్నంగా వీడియో కాల్ లో మాట్లాడుతున్న వీడియో ఒకటి రాష్ట్రంలో ఇటీవల తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. 

ALso Read:న్యూడ్ వీడియో వ్యవహారంపై ఏపీ సీఐడీకి గోరంట్ల మాధవ్ ఫిర్యాదు

కాగా.. ఆగస్ట్ 10వ తేదీన సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోన్న ఎంపీ మాధవ్ వీడియో నకిలీదని అనంతపురం ఎస్పీ ఫకీరప్ప ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ వీడియోను పోస్టు చేసిన వారి కోసం దర్యాప్తు చేస్తున్నామని.. దీనిని మార్పింగ్ లేదా ఎడిటింగ్ చేసినట్టుగా ఉందని, ఒరిజినల్ వీడియో దొరికితేనే ఫోరెన్సిక్ ల్యాబ్ పంపుతామని ఎస్పీ వివరించారు. అనంతపురం ఎస్పీ వ్యాఖ్యలపై టీడీపీ నేతలు మండిపడ్డారు ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపకుండా ఈ వీడియో ఒరిజినల్ కాదని ఎస్పీ ఎలా చెబుతారని వారు ప్రశ్నించారు. ఎస్పీ ఫోరెన్సిక్ నిపుణుడా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

అలాగే వీడియోను జాతీయ ఫోరెన్సిక్ ల్యాబ్‌లో టెస్ట్ చేయాలని తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత డిమాండ్ చేశారు. మహిళలపై ఇంత అసభ్యంగా ప్రవర్తించిన ఎంపీపై, ఆయనకు సహకరిస్తున్న పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని అనిత లేఖలో పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి మహిళలపై దాడులు పెరిగిపోయాయని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ రెడ్డి పాలనలో మహిళలు అభద్రతా భావంలోకి నెట్టబడ్డారని అనిత ఆవేదన వ్యక్తం చేశారు

click me!