
అమరావతి: రాష్ట్రంలో జరిగిన నరేగా పనులను బిల్లులను సకాలంలో చెల్లించకపోవడంపై ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్ అయ్యింది. 2018 నుంచి 2019 వరకు ఎన్ని నిధులు పెండింగ్లో ఉన్నాయి.. ఎంత మొత్తం చెల్లించాలో కోర్టుకు నివేదించాలని ధర్మాసనం సూచించింది. నరేగా పనులకు సంబంధించి ఆ ఏడాది కేంద్రం నుంచి డబ్బులు రాలేవని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. అయితే ఆ ఏడాదికి డబ్బులు రాకపోతే తర్వాత సంవత్సరాలకు నిధులు ఎలా వచ్చాయని హైకోర్టు ప్రశ్నించింది.
ఐదు లక్షల బిల్లులను 20 శాతం తగ్గించి ఇస్తామని అఫిడవిట్ వేసి ఎందుకు ఇవ్వలేదంటూ ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రెండు వారాల్లోపు పూర్తిస్థాయి అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. సరైన సమాధానం ఇవ్వకపోతే సీఎస్ను కోర్టుకు పిలిపిస్తామంటూ న్యాయస్థానం హెచ్చరించింది.
ఏడు లక్షల పనులకు సంబంధించి బిల్లులు పెండింగ్లో ఉన్నాయని పిటిషన్ల తరపు న్యాయవాది నర్రా శ్రీనివాస్ పేర్కొన్నారు. కేంద్రం నుంచి వచ్చిన నిధులను దారి మళ్లించారని ఆరోపించారు. దీంతో పూర్తిస్థాయి వివరాలతో కూడిన మరో అఫిడవిట్ వెంటనే దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.