మాజీ మంత్రి నారాయణకు ఊరట:ఇంట్లోనే విచారించాలని సీఐడీకి హైకోర్టుఆదేశం

By narsimha lodeFirst Published Nov 16, 2022, 2:25 PM IST
Highlights

మాజీ మంత్రి నారాయణను ఇంటి వద్దే విచారించాలని ఏపీ హైకోర్టు సీఐడీని ఆదేశించింది. ఏపీసీఐడీ ఇచ్చిన నోటీసులను నారాయణహైకోర్టులో సవాల్ చేశారు. దీనిపై ఏపీ హైకోర్టు విచారించింది.
 

అమరావతి: మాజీ మంత్రి నారాయణను ఇంటి వద్దే విచారించాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బుధవారంనాడు ఏపీ సీఐడీని ఆదేశించింది.అమరావతి రాజధాని ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ కేసులో 160 సీఆర్‌పీసీ సెక్షన్ కింద ఏపీ సీఐడీ  పోలీసులు మాజీ మంత్రి నారాయణకు నోటీసులు జారీ చేశారు.ఈ నోటీసులను  మాజీ  మంత్రి నారాయణ ఏపీ హైకోర్టులో సవాల్ చేశారు. మాజీ మంత్రి నారాయణకు శస్త్రచికిత్స జరిగిన విషయాన్ని ఆయన  తరపు న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. హైద్రాబాద్ కూకట్‌పల్లిలోనే మజీ మంత్రి నారాయణను విచారించాలని   నారాయణ తరపు న్యాయవాది కోరారు.వయస్సు,ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని  నారాయణను కూకట్ పల్లిలోని ఆయన నివాసంలోనే విచారించాలని  ఏపీ హైకోర్టు ఇవాళ  ఆదేశాలు జారీ చేసింది.

అమరావతి  రాజధాని ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ లో మార్పులు చేర్పులు చేశారని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏపీ సీఐడీకి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.ఈ ఏడాది మే 10వ తేదీన మాజీ సీఎం చంద్రబాబునాయుడుసహా  మాజీ మంత్రి నారాయణలపై సీఐడీ కేసులు నమోదు చేసింది.ఈ కేసులో చంద్రబాబును ఏ-1గా, నారాయణను -2 గా సీఐడీ చేర్చింది. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ మార్పు చేశారని అందిన ఫిర్యాదు ఆధారంగా 120బీ, 420, 34, 36,37, 166 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.2014-19 మధ్య భూసేకరణలో అవకతవకలు జరిగినట్టుగా ఆళ్ల రామకృష్ణారెడ్డి సీఐడీకి  పిర్యాదు చేశారు. అలైన్ మెంట్ మార్పుతో రామకృష్ణ హౌసింగ్, హెరిటేజ్ ఫుడ్స్, ఎల్ఈపీఎల్ ప్రాజెక్ట్స్, లింగమనేని అగ్రికల్చర్ పామ్స్, జయని ఎస్టేట్స్ కు లబ్ది కల్గించారని ఆరోపణలున్నాయి.

ఈ కేసులో మాజీ మంత్రి నారాయణకు ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చింది.అయితే ఈ ముందస్తు బెయిల్ ను రద్దు చేయాలనిసుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది.ఈ పిటిషన్ పై విచారణ నిర్వహించిన సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ రద్దుకు నిరాకరించింది.ఈ మేరకు ఈ నెల 7న ఆదేశాలు జారీచేసింది సుప్రీంకోర్టు. 

click me!