మాన్సాస్ ట్రస్ట్‌ ఈవోకి హైకోర్టు నోటీసులు,ఆగ్రహం: ఆశోక్‌గజపతి పిటిషన్ పై విచారణ

By narsimha lodeFirst Published Jul 27, 2021, 12:57 PM IST
Highlights

మాన్సాస్ ట్రస్ట్ ఈవో తీరుపై ఏపీ హైకోర్టు మంగళవారం నాడు  ఆగ్రహం వ్యక్తం చేసింది.  మాజీ కేంద్ర మంత్రి ఆశోక్ గజపతి రాజు దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు ఇవాళ విచారణ నిర్వహించింది. ఈ విచారణ సందర్భంగా ఈవోపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయనకు నోటీసులు జారీ చేసింది.

అమరావతి:మాన్సాస్ ట్రస్ట్ ఈవో వెంకటేశ్వరరావుకి ఏపీ హైకోర్టు మంగళవారం నాడు నోటీసులు జారీ చేసింది. మాజీ కేంద్ర మంత్రి మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మెన్ ఆశోక్‌గజపతి రాజు దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు ఇవాళ విచారణ నిర్వహించింది.తమకు వేతనాలు ఇవ్వాలని  ఇటీవల మాన్సాస్ ట్రస్ట్ ఉద్యోగులు ఆందోళన నిర్వహించారు. ఈ విషయమై ఉద్యోగులపై ఈవో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉద్యోగులకు మద్దతుగా ట్రస్ట్ ఛైర్మెన్ ఆశోక్ గజపతి రాజు నిలిచిన విషయం తెలిసిందే.

మాన్సాస్ ట్రస్ట్ ఈవో తీరును నిరసిస్తూ హైకోర్టులో మాజీ కేంద్రమంత్రి ఆశోక్ గజపతిరాజు పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్ పై విచారణ నిర్వహించిన హైకోర్టు ఈవో తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈవో వెంకటేశ్వరరావుకు నోటీసులు జారీ చేసింది.మాన్సాస్ లో ఆడిట్ ను స్టేట్ అధికారులే నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. ఆడిట్ కోసం ఇతరుల అవసరం లేదని హైకోర్టు అభిప్రాయపడింది.మాన్సాస్ ఉద్యోగులకు వెంటనే జీతాలు చెల్లించాలని కూడ హైకోర్టు ఆదేశించింది. ఈవో ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు సస్పెండ్ చేసింది. ట్రస్టు పరిధిలోని సంస్థల్లో జోక్యం చేసుకోవద్దని కూడ  హైకోర్టు ఈవోను ఆదేశించింది.
 

మాన్సాస్ ట్రస్ట్ చైర్మెన్ గా ఇటీవల హైకోర్టు ఆదేశాలతో ఆశోక్ గజపతిరాజు బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ట్రస్ట్ చైర్మెన్ గా ఉన్న ఆశోక్ గజపతిరాజును వైఎస్ జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలగించింది. ఆయన స్థానంలో  ఆనందగజపతి రాజు కూతురు సంచయిత గజపతిరాజును నియమించింది.ఈ నియామాకాన్ని ఆశోక్ గజపతి రాజు కోర్టులో సవాల్ చేసిన విషయం తెలిసిందే.


 

click me!