శ్రీశైలానికి భారీగా వరద: 24 గంటల్లో 28 టీఎంసీలు

By narsimha lodeFirst Published Jul 27, 2021, 12:01 PM IST
Highlights

శ్రీశైలం ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. 24 గంటల వ్యవధిలోనే 28 టీఎంసీల నీరు వచ్చి చేరింది. ఎగువన కురిసిన భారీ వర్షాల కారణంగా ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల, తుంగభద్ర ప్రాజెక్టుల నుండి  వరద నీరు శ్రీశైలంలోకి వచ్చి చేరుతోంది.


కర్నూల్: ఎగువన కురిసిన భారీ వర్షాల కారణంగా 24 గంటల వ్యవధిలో శ్రీశైలం ప్రాజెక్టుల్లోకి 28 టీఎంసీల నీరు వచ్చి చేరింది. ఆదివారం ఉదయం ఆరు గంటల నుండి 24 గంటల వ్యవధిలోనే 28 టీఎంసీల వరద శ్రీశైలంలోకి చేరింది. ఈ ప్రాజెక్టులోకి ప్రస్తుతం  3.74 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. ఈ ప్రవాహం ఇలానే కొనసాగితే ప్రాజెక్ట్ గేట్లు ఎత్తివేసే అవకాశం ఉంది.

శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు. సోమవారం నాడు రాత్రికి శ్రీళైలం ప్రాజెక్టులో నీటి మట్టం 872 అడుగులకు చేరుకొంది. ప్రాజెక్టులో ప్రస్తుతం 152.8314 టీఎంసీల నీరుంది. ఈ ప్రాజెక్టులో 215 టీఎంసీల నీటిని నిల్వ చేసుకొనే వీలుంది. కర్ణాటక రాష్ట్రంలోని ఆల్మట్టి ప్రాజెక్టుకు 3.88 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. 

దీంతో మూడు లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నారాయణపూర్ ప్రాజెక్టుకు 2.95 లక్షలు వరద వస్తోంది. 2.86 లక్షల క్యూసెక్కులను నారాయణపూర్ నుండి జూరాలకు విడుదల చేస్తున్నారు.తుంగభద్ర రిజర్వాయర్‌కు 1.65 లక్షల వరద వస్తుండగా1.49 లక్షల క్యూసెక్కులను కిందకు వదిలేస్తున్నారు. దీంతో జూరాల ప్రాజెక్టుకు 3.50 లక్షల క్యూసెక్కుల ఇన్‌ ఫ్లో వస్తోంది. 35 గేట్లను ఎత్తి 3.18 లక్షల క్యూసెక్కులను  శ్రీశైలం ప్రాజెక్టులోకి విడుదల చేస్తున్నారు. 

నాగార్జునసాగర్‌ నీటిమట్టం సోమవారం సాయంత్రం 538.80 అడుగులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగుల (312.04 టీఎంసీలు)కు గాను 538.80 అడుగులు (185.83 టీఎంసీలు)గా ఉంది. ప్రస్తుతం25,427 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది.
 ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 1000 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. పులిచింతల ప్రాజెక్టులో విద్యుదుత్పత్తి సోమవారం సైతం కొనసాగింది. 


 

click me!