
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కేసులో (Skill Development Corporation) నిందితుడిగా ఉన్న గంటా సుబ్బారావుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు (Andhra Pradesh High Court ) షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి గంటా సుబ్బారావు బెయిల్ పిటిషన్పై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా గంటా సుబ్బారావుకు (Ghanta Subba Rao) షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు ధర్మాసనం.. సీఐడీ పోలీసులకు అందుబాటులో ఉండాలని ఆదేశించింది. ప్రతి శనివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సీఐడీకి అందుబాటులో ఉండాలని సుబ్బారావును ఆదేశించింది. సుబ్బారావును విచారించాలంటే ఒకరోజు ముందుగా నోటీసులివ్వాలని సీఐడీకి ఆదేశాలు జారీ చేసింది.
స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి కమిటీలో ఉన్న వారందరినీ ఎందుకు చేర్చలేదని ధర్మాసనం ప్రశ్నించింది. సుబ్బారావు నిధులు దుర్వినియోగం చేశారని తమ వద్ద ఏదైనా ఆధారాలు ఉన్నాయా అని అడిగింది. కొంతమందిని కేసులో నిందితులుగా పేర్కొనడం పట్ల సుబ్బారావు తరపు లాయర్ ఆదినారాయణ రావు అభ్యంతరం వ్యక్తం చేశారు. కొంతమందిని కావాలని కేసులో ఇరికించారని సుబ్బారావు హైకోర్టు దృష్టికి తీసుకువెళ్లారు.
టీడీపీ హయాంలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చేపట్టిన సీమెన్స్ ప్రాజెక్టు వ్యవహారంలో రూ. 241 కోట్లు మేర నిధులు దుర్వినియోగం అయ్యాయన్న ఫిర్యాదుపై సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో మాజీ సీఈవో, ఎండీ గంటా సుబ్బారావును, మరికొందరని నిందితులుగా చేర్చారు. ఈ క్రమంలోనే సీఐడీ అధికారులు గంటా సుబ్బారావును అరెస్టు చేశారు. బెయిల్ కోసం గంటా సుబ్బారావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా ఈ పిటిషన్పై నేడు విచారణ చేపట్టిన హైకోర్టు.. సుబ్బారావుకు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.