తమకు ఆత్మహత్య చేసుకొనేందుకు అనుమతి ఇవ్వాలని ప్రకాశం జిల్లాకు చెందిన వెంకటేశ్వర్లు రాసిన లేఖపై ఏపీ హైకోర్టు స్పందించింది. ఈ ఘటనపై విచారణ అధికారులుగా జాయింట్ కలెక్టర్, ఆర్డీఓలను నియమిస్తూ ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఒంగోలు: తమకు ఆత్మహత్య చేసుకొనేందుకు అనుమతి ఇవ్వాలని ప్రకాశం జిల్లాకు చెందిన వెంకటేశ్వర్లు రాసిన లేఖపై ఏపీ హైకోర్టు స్పందించింది. ఈ ఘటనపై విచారణ అధికారులుగా జాయింట్ కలెక్టర్, ఆర్డీఓలను నియమిస్తూ ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
గ్రామస్తులు తమ కుటుంబాన్ని వెలివేయడంతో తమ కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకొనేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర గవర్నర్, ఏపీ హైకోర్టుకు వెంకటేశ్వర్లు ఈ నెల 2వ తేదీన లేఖ రాశాడు. ఈ లేఖపై ఈ నెల 3వ తేదీన ఏపీ హైకోర్టు విచారణకు ఆదేశించింది.ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్, మార్కాపురం ఆర్డీఓలను విచారణ అధికారులుగా నియమించింది.
ప్రకాశం జిల్లాలోని వేటపాలెం మండలం రామచంద్రాపురంలో గ్రామానికి చెందిన భూమిని వెంకటేశ్వరరావు తన పేరున రిజిస్ట్రేషన్ చేయించుకొన్నారని ఆరోపిస్తూ వెంకటేశ్వరరావు కుటుంబాన్ని గ్రామం నుండి వెలివేశారు.
ఈ విషయమై గత ఏడాది వెంకటేశ్వరరావు కూతురు సీఎం జగన్ కు లేఖ రాస్తే విచారణకు సీఎం ఆదేశించారు. ఆ సమయంలో కలెక్టర్ విచారణ చేసి వెంకటేశ్వరరావును కలుపుకుపోవాలని గ్రామస్తులకు సూచించారు. అయినా ఫలితం లేకుండాపోయింది. దీంతో గత ఏడాదే కలెక్టరేట్ ముందు వెంకటేశ్వరరావు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
తాజాగా వెంకటేశ్వరరావు గవర్నర్ కు , హైకోర్టుకు లేఖ రాయడంతో ఏపీ హైకోర్టు విచారణకు ఆదేశించింది. త్వరగా నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.