దావోస్ లో జరిగి వరల్డ్ ఎకానమిక్ ఫోరంలో సదస్సులో వ్యవసాయ , అధునాతన సాంకేతిక అంశాలపై ప్రధానంగా చర్చించనున్నట్లు పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు.
విశాఖపట్నం: విశాఖపట్నంలో ఐటిని అభివృద్ధి చేసే దిశగా, బీచ్ ఐటిని ప్రమోట్ చేసేందుకు దావోస్ సదస్సు (davos summit) ను ఉపయోగించుకుంటామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ (gudiwada amarnath) తెలిపారు. దావోస్ లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (world economic forum 2022) లో పాల్గొంటున్నామని... ఇది మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటి విదేశీ పర్యటన అన్నారు. మొత్తం 18 అంశాలపై సదస్సు జరిగితే 10 అంశాల్లో ఆంధ్ర ప్రదేశ్ పాల్గొంటోందన్నారు. ఈ నెల 24, 25, 26 తేదీల్లో మూడు రోజులపాటు సదస్సు జరుగుతుందని మంత్రి అమర్నాథ్ వెల్లడించారు.
దావోస్ సదస్సులో వ్యవసాయ , అధునాతన సాంకేతిక అంశాలపై ప్రధానంగా చర్చించనున్నట్లు మంత్రి తెలిపారు. 2800 మందికి పైగా ప్రముఖులు ఈ దావోస్ సదస్సు లో పాల్గొంటున్నారని తెలిపారు. రాష్ట్ర వనరులకు సంబంధించి ఒక పెవిలియన్ ఏర్పాటు చేస్తున్నామని... గత ప్రభుత్వాలు ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ లో చేసిన దుష్ప్రచారాన్ని నమ్మవద్దని సూచించారు. గత సదస్సు లు జరిగిన పరిస్థితికి, కోవిడ్ తరవాత జరిగే ఈ సదస్సు లో చాలా మార్పు ఉందన్నారు. మన వనరులు చూపించే ఒక అవకాశం మాత్రమే దావోస్ సదస్సులో వుంటుదని మంత్రి తెలిపారు.
''రాష్ట్రంలో పోర్ట్ ల అభివృద్ధి జరుగుతోంది. భావనపాడు, రామయ్య పట్నం పోర్ట్ లు అభివృద్ధి చేస్తున్నాము. కాకినాడ పోర్ట్ కు మారిటైం బోర్డ్ నుంచి రూ.50 కోట్లు తెచ్చి అభివృద్ధి చేసాం. శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు ఉన్న తీర ప్రాంతాన్ని వినియోగించుకుని అభివృద్ధి దిశలో ప్రయాణం చేస్తాం. నక్కపల్లి రాంబిల్లి లో ఆరు వేల ఎకరాలు భూసేకరణకు వెళ్తున్నాం. ఇదే తరహా లో ఓర్వకల్లు లో కూడా పారిశ్రామిక వాడలా అభివృద్ధి చేస్తున్నాము'' అని పరిశ్రమల శాఖామంత్రి వెల్లడించారు.
Video
''హైదరాబాద్ అభివృద్ధి వెనుక అందరి కష్టం ఉంది. ప్రధాన నగరం ఉన్న ప్రాంతాలు అభివృద్ధి జరిగింది. అందుకే మన రాష్ట్రంలో విశాఖ ను అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేస్తున్నాము. అన్ని ఇంజనీరింగ్ కాలేజీల స్టూడెంట్స్ లోని స్టార్ట్ అప్ ఆలోచనలను ప్రోత్సహించాలని నిర్ణయం తీసుకున్నాం. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలంటే ప్రభుత్వ సహకారం పూర్తిగా ఉంటుంది'' అని మంత్రి తెలిపారు.
''వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ మూడేళ్ళలో దాదాపు 20 వేల ఐటీ ఉద్యోగాలు పెరిగాయి. విశాఖను ఈ రాష్ట్రానికి ఒక ఐటి హబ్ గా తీర్చిదిద్దుదాం. కేవలం ఖర్చులు తగ్గించుకునేందుకే విశాఖ నుండి హెచ్ఎస్ బిసి తరలిపోయింది. ఆ ప్రదేశంలో మరో మల్టి నేషనల్ కంపెనీ వచ్చింది'' అని మంత్రి పేర్కొన్నారు.
''ఇప్పటికే కొన్ని ఇంక్యుబేషన్ సెంటర్స్ ప్రతినిధులతో మాట్లాడాం. విఎంఆర్డిఏ కు చెందిన స్థలాలు, భవనాలు ఇవ్వడానికి చర్చ జరిపాం. తూర్పు నావికా దళంలో పరిధి జాతీయ రక్షణ పరమైన అంశాలున్నాయి'' అని తెలిపారు.
''ఈ రాష్ట్రంలో 90 శాతం ఇళ్లకు అందాల్సిన సాయం అందింది. గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమం లో అపూర్వ స్పందన కనిపిస్తోంది. పరిశ్రమలో జరుగుతున్న ప్రమాదాలను తగ్గించే విధంగా చర్యలు తీసుకుంటున్నాము. చంద్రబాబు తన వద్ద ఉన్న నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకోవడానికి దావోస్ పర్యటనలు వాడుకున్నారు'' అని పరిశ్రమల మంత్రి అమర్నాథ్ పేర్కొన్నారు.