వేధిస్తున్న బెడ్ల కొరత.. ఏపీ వినూత్న ప్రయోగం, ఇక ఆర్టీసీ బస్సులే ఆసుపత్రులు

By Siva KodatiFirst Published May 27, 2021, 5:21 PM IST
Highlights

వైద్య సదుపాయాలు అంతంత మాత్రంగా ఉండే ఏజెన్సీ ప్రాంతాల్లో ఆర్టీసీ స్లీపర్‌ బస్సుల్లో కోవిడ్‌ రోగులకు చికిత్స అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఏపీ రవాణాశాఖ మంత్రి పేర్ని నాని గురువారం ప్రకటించారు

కరోనా సెకండ్ వేవ్ ఆంధ్రప్రదేశ్‌పై ఎలాంటి ప్రభావం చూపుతోంది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రతిరోజూ వేలల్లో కేసులు, వందకు తగ్గకుండా మరణాలతో ఏపీలో పరిస్ధితులు దారుణంగా వున్నాయి. పాజిటివ్‌గా తేలి ఆరోగ్యం విషమించిన వారు చికిత్స కోసం ఆసుపత్రులకు వెళితే.. అక్కడ బెడ్లు, ఆక్సిజన్, వెంటిలేటర్ల కొరత వేధిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సమస్యను అధిగమించేందుకు గాను ఏపీ ప్రభుత్వం వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది.

ముఖ్యంగా వైద్య సదుపాయాలు అంతంత మాత్రంగా ఉండే ఏజెన్సీ ప్రాంతాల్లో ఆర్టీసీ స్లీపర్‌ బస్సుల్లో కోవిడ్‌ రోగులకు చికిత్స అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఏపీ రవాణాశాఖ మంత్రి పేర్ని నాని గురువారం ప్రకటించారు. ఏజెన్సీ ప్రాంతాలైన బుట్టాయిగూడెం, కె.ఆర్.పురం పీహెచ్‌సీలో ఆక్సిజన్‌ సౌకర్యంతో వున్న బస్సులు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఆస్పత్రులు అందుబాటులో లేని  ప్రాంతాల్లో బస్సులను అందుబాటులో ఉంచుతామని పేర్ని నాని వెల్లడించారు.

Also Read:ప్రతి హాస్పిటల్లో 50శాతం బెడ్స్ ఆరోగ్యశ్రీ కే... మంత్రుల కమిటీ మరిన్ని కీలక నిర్ణయాలు

ప్రస్తుతం 10 ఆర్టీసీ స్లీపర్ బస్సుల్లో ఆక్సిజన్ బెడ్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు మంత్రి పేర్కొన్నారు. ఇక్కడి ఫలితాల ఆధారంగా భవిష్యత్తులో మరిన్ని ఆర్టీసీ స్లీపర్ బస్సుల్లో ఆక్సిజన్ బెడ్లు ఏర్పాటు చేస్తామని పేర్ని నాని ప్రకటించారు. ప్రయోగాత్మకంగా వెన్నెల బస్సుల్లో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ బెడ్లను మంత్రి ఈ సందర్భంగా పరిశీలించారు. బస్సుల్లో సౌకర్యాలను ఆర్టీసీ ఎండీ ఆర్పీ ఠాకూర్ మంత్రి నానికి వివరించారు.  

click me!