పీఆర్సీ రగడ.. మమ్మల్నే తప్పుగా చూపిస్తున్నారు, 3 డిమాండ్లు పరిష్కరిస్తేనే చర్చలు : వెంకట్రామిరెడ్డి

By Siva KodatiFirst Published Jan 27, 2022, 5:49 PM IST
Highlights

చర్చలు మాకు ఇష్టం లేదన్నట్లుగా ప్రభుత్వం మాట్లాడటం సరికాదని వెంకట్రామిరెడ్డి స్పష్టం చేశారు. మమ్మల్నే తప్పుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. తమ డిమాండ్లు ఏంటో ఇప్పటికే చెప్పామన్నారు. ప్రభుత్వానికి తమ ప్రతినిధుల బృందం ఇప్పటికే నివేదించిందని వెంకట్రామిరెడ్డి చెప్పారు. 

పీఆర్సీ (prc) వ్యవహారానికి సంబంధించి ఏపీ సచివాలయంలో పీఆర్సీ సాధన సమితి సమావేశం  ముగిసింది. జీతాలు ప్రాసెస్ చేయకుంటే చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం వార్నింగ్ ఇచ్చిన నేపథ్యంలో.. ఈ వ్యవహారంపై ఉద్యోగ నేతలు చర్చలు జరిపారు. అనంతరం సచివాలయ ఉద్యోగ సంఘం నేత వెంకట్రామిరెడ్డి (venkatrami reddy) మీడియాతో  మాట్లాడుతూ... మొన్న లేఖ ఇచ్చి గంటన్నరపాటు చర్చించి వచ్చారని అన్నారు. చర్చలు మాకు ఇష్టం లేదన్నట్లుగా ప్రభుత్వం మాట్లాడటం సరికాదని వెంకట్రామిరెడ్డి స్పష్టం చేశారు. 

మమ్మల్నే తప్పుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. తమ డిమాండ్లు ఏంటో ఇప్పటికే చెప్పామన్నారు. ప్రభుత్వానికి తమ ప్రతినిధుల బృందం ఇప్పటికే నివేదించిందని వెంకట్రామిరెడ్డి చెప్పారు. ట్రెజరీ ఉద్యోగులు, డీడీవోలపై ప్రభుత్వం ఒత్తిడి తెస్తోందని వెంకట్రామిరెడ్డి మండిపడ్డారు. పాత జీతాలే ఇవ్వాలని తాము కోరుతున్నామన్నారు. అప్పుడే  ప్రభుత్వంపై తమకు నమ్మకం కలుగుతుందని... 3 డిమాండ్లు పరిష్కరించిన తర్వాతే చర్చలకు వస్తామని వెంకట్రామిరెడ్డి స్పష్టం చేశారు. 

అంతకుముందు ఉద్యోగ సంఘ నేతలు ప్రభుత్వ పరిస్థితిని అర్థం చేసుకోవాలని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (sajjala rama krishna reddy) సూచించారు. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన.. చర్చల ద్వారానే సమస్యకు పరిష్కారం దొరుకుతుందన్నారు. పరిస్థితి చేజారిపోక ముందే ఉద్యోగ సంఘాల నేతలు ఈ అంశాన్ని ముగించేందుకు సహకరించాలని రామకృష్ణారెడ్డి కోరారు. చర్చలకు రమ్మని తామే కోరుతున్నామని సజ్జల తెలిపారు. 

అయినా చర్చలకు రాకుండా మొండికి వేయడం తగదని హితవు పలికారు. చర్చలకు వస్తేనే కదా? కమిటీలో చర్చిస్తేనే కదా? అసలు సమస్య ఏంటో తెలిసేది అని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తమ కమిటీ పరిధిలో లేని అంశాన్ని ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకెళతామని చెప్పారు. ప్రభుత్వం నాలుగు మెట్లు దిగడానికి సిద్ధంగా ఉన్నామని చెబుతున్నా ఉద్యోగ సంఘాల నేతలు మొండికేయడం తగదని రామకృష్ణారెడ్డి అన్నారు. తాము చర్చల కోసం ప్రతి రోజూ సచివాలయంలో వేచి చూస్తూనే ఉంటామన్నారు.

ఇప్పటికే ప్రభుత్వం ఉద్యోగులను మూడు దఫాలు చర్చలకు పిలిచింది. మరోసారి కూడా చర్చలకు రావాలని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కోరారు. అయితే ఉద్యోగ సంఘాల నేతలు ఇప్పటికే ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ సలహదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో  ఉద్యోగ సంఘాల భేటీకి ప్రాధాన్యత నెలకొంది.

మరోవైపు January నెల జీతాలను కొత్త పీఆర్సీ మేరకు ఇవ్వాలని ఏపీ సర్కార్ ప్రయత్నాలు ప్రారంభించింది. కొత్త పీఆర్సీ మేరకు జీతాల బిల్లులను ఆన్ లైన్ లో అప్ లోడ్ చేయడంతో పాటు ప్రాసెస్ చేయాలని కూడా ఆర్ధిక శాఖ ఆదేశించింది. ఒకవేళ అలా చేయకపోతే క్రమశిక్షణ చర్యలు తీసకొంటామని కూడా హెచ్చరించింది. ఈ వార్నింగ్ పై కూడా ఉద్యోగ సంఘాల నేతలు చర్చిస్తున్నారు.
 

click me!