కొత్త జిల్లాల ఏర్పాటు: అభ్యంతరాలు, ఆందోళనలు... ప్రజా చైతన్య కార్యక్రమాలకు వైసీపీ పిలుపు

By Siva KodatiFirst Published Jan 27, 2022, 5:12 PM IST
Highlights

కొత్త జిల్లాల అంశాన్ని ప్రజలకు వివరించేందుకు రాష్ట్రంలో నేటి నుంచి ప్రజా చైతన్య కార్యక్రమాలు (public awareness programs) నిర్వహిస్తున్నట్టు సజ్జల తెలిపారు. ఆ మేరకు వైసీపీ ప్రజాప్రతినిధులకు ఆయన పిలుపునిచ్చారు. ఇవాళ్టి నుంచి ఈ నెల 29 వరకు మూడ్రోజుల పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ కోఆర్డినేటర్లు తమ పరిధిలో ప్రజా చైతన్య కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని రామకృష్ణారెడ్డి సూచించారు

ఏపీలో కొత్త జిల్లాల (new districts) ఏర్పాటుకు వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్ర కేబినెట్ (ap cabinet) కూడా కొత్త జిల్లాలకు ఆమోదం తెలపడంతో, తదుపరి కార్యాచరణ వేగవంతం అయ్యింది. కొత్తగా ఏర్పడిన పలు జిల్లాలకు అన్నమయ్య, ఎన్టీఆర్, శ్రీ బాలాజీ, శ్రీ సత్యసాయి జిల్లాల పేరిట నామకరణం చేయడంతో ప్రభుత్వంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే సమయంలో కడప జిల్లాలోని రాజంపేట కేంద్రంగా అన్నమయ్య జిల్లాను ఏర్పాటు చేయకపోవడంపై ఆందోళనలు జరుగుతున్నాయి. 

ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వ సలహాదారు, వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి (sajjala rama krishna reddy) కొత్త జిల్లాల ఏర్పాటుపై మరికొన్ని వివరాలు వెల్లడించారు. కొత్త జిల్లాల అంశాన్ని ప్రజలకు వివరించేందుకు రాష్ట్రంలో నేటి నుంచి ప్రజా చైతన్య కార్యక్రమాలు (public awareness programs) నిర్వహిస్తున్నట్టు సజ్జల తెలిపారు. ఆ మేరకు వైసీపీ ప్రజాప్రతినిధులకు ఆయన పిలుపునిచ్చారు. ఇవాళ్టి నుంచి ఈ నెల 29 వరకు మూడ్రోజుల పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ కోఆర్డినేటర్లు తమ పరిధిలో ప్రజా చైతన్య కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని రామకృష్ణారెడ్డి సూచించారు. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ, ఏపీ చరిత్రలో ఇదొక చారిత్రక ఘట్టంగా ఆయన అభివర్ణించారు. ఇప్పుడున్న 13 జిల్లాలను 26 జిల్లాలుగా మార్చుతూ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారని.. ప్రజల ఆకాంక్షలను సీఎం జగన్ గౌరవించారని సజ్జల రామకృష్ణారెడ్డి కొనియాడారు. 

కాగా.. రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రతిపాదనకు మంత్రి మండలి మంగళవారం నాడు ఆమోదం  తెలిపింది. ఇప్పుడున్న 13 జిల్లాల స్థానంలో 26 జిల్లాలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం బుధవారం Notification  విడుదల చేసింది.ఈ నోటిఫికేషన్ పై ప్రజలు తమ సూచనలు,సలహాలతో పాటు అభిప్రాయాలను తెలపాలని ప్రభుత్వం కోరింది. వచ్చే నెల 26వ తేదీ వరకు ప్రజలకు గడువును ఇచ్చింది. ఉగాది నుండి కొత్త జిల్లాల నుండి పాలన సాగించాలని జగన్ సర్కార్ తలపెట్టింది. ఇదే విషయాన్ని రిపబ్లిక్ డే ఉత్సవాల్లో కూడా గవర్నర్ ప్రస్తావించారు.

ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని జిల్లాగా ఏర్పాటు చేస్తామని ఎన్నికలకు ముందు YS Jagan హామీ ఇచ్చారు. రాష్ట్రంలో 25 లోక్‌సభ స్థానాలున్నాయి. అయితే రాష్ట్రంలో 26 జిల్లాలను ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్ ఇచ్చారు.. అరకు ఎంపీ స్థానాన్ని రెండు జిల్లాలుగా విభజించారు. అరకు పార్లమెంట్ స్థానం నాలుగు జిల్లాల పరిధిలో విస్తరించి ఉంది. దీంతో  ఈ ఎంపీ స్థానాన్ని రెండు జిల్లాలు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ఈ మేరకు గతంలోనే జీవోను జారీ చేసింది.
 

click me!