
అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో సలహాదారుడు వచ్చాడు. ప్రభుత్వ పెద్దలను సైతం తన వద్దకు రప్పించుకునే ఓ కీలక స్వామీజీ నుంచి ఆశీస్సులు ఉన్న వ్యక్తికి దేవాదాయ శాఖ సలహాదారుగా పదవి వరించింది. అనంతపురం జిల్లాకు చెందిన జ్వాలాపురం శ్రీకాంత్ను దేవాదాయశాఖ సలహాదారుగా నియమిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన ఈ పదవిలో రెండేళ్లు ఉంటారు. శ్రీకాంత్ ఏపీ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య అధ్యక్షుడు. ఈ సమాఖ్యలో ఉండే ముగ్గురు విడిపోయి దీన్ని మూడు ముక్కలు చేశారు. ఎవరికి వారు తమని అధ్యక్షులుగా చెప్పుకుంటున్నారు. వారిలో శ్రీకాంత్ కూడా ఒకరు. ఈయన గత ప్రభుత్వ హయాంలో బ్రాహ్మణ కార్పొరేషన్ కు అనంతపురం నగర పాలక సంస్థ సమన్వయకర్తగా కొంతకాలం ఉన్నారు.
సార్వత్రిక ఎన్నికలకు ముందు వైసీపీ లోకి వెళ్లారు. ప్రభుత్వాన్ని దేవాదాయశాఖను శాసిస్తున్న ఓ కీలక స్వామీజీకి ఈయన చాలా కాలంగా ముఖ్యమైన శిష్యుడిగా ఉన్నారు. గతంలో ఆయనను అనంతపురానికి ఆహ్వానించి పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఆయన సిఫార్సు ద్వారా మొదట టీటీడీ బోర్డు సభ్యుని పదవి కోసం ప్రయత్నించారని తెలిసింది. ఆ అవకాశం రాకపోవడంతో సలహాదారు దృష్టిపెట్టారు. చాలా కాలంగా ఈ లెటర్ పెండింగ్లో ఉన్నట్లు తెలిసింది. ఎట్టకేలకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. వాస్తవానికి దేవాదాయ శాఖ సలహాదారు పోస్టు ప్రత్యేకంగా లేదని, దానికి విధులు, బాధ్యతలు వంటివి తెలిపే ఉత్తర్వులూ లేవని, దీన్నిరాజకీయ పునరావాసం గానే పరిగణించాలి అని దేవాదాయ శాఖ వర్గాలు చెబుతున్నాయి.
గన్నవరం వైసీపీలో మళ్లీ భగ్గుమన్న విభేదాలు... వల్లభనేని ఆఫీసు వద్ద వంశీ- యార్లగడ్డ వర్గాల ఘర్షణ
ఆలయాల ఆధాయం నుంచే : వార్షిక ఆదాయం 5 లక్షలు దాటిన ఆలయాల నుంచి దేవాదాయ పరిపాలన నిధి నిధి (ఈఏఎఫ్) కింద 8శాతం వసూలు చేస్తారు. వీటి నుంచి శ్రీకాంత్ కు జీతం, ఇతర భత్యాలు కలిపి నెలకు రూ. లక్షన్నరకు పైగా ఇస్తారని అధికారులు చెబుతున్నారు.
ముగ్గురు సలహాదారుల పదవీకాలం పొడగింపు : రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురు సలహాదారుల పదవీ కాలాన్ని మరో ఏడాది పొడిగించింది. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ఇండస్ట్రియల్ ప్రమోషన్) క్రిష్ణ జి.వి. గిరితో పాటు, it (సాంకేతిక) సలహాదారులు దేవిరెడ్డి శ్రీనాథ్, జె. విద్యాసాగర్ రెడ్డిల పదవీ కాలాన్ని మరో ఏడాది పొడిగిస్తూ ప్రభుత్వం జూలై 29న ఉత్తర్వులు జారీ చేసింది ఆన్లైన్లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.