గురజాల డీఎస్పీ శ్రీహరి, సీఐ దుర్గా ప్రసాద్లను సస్పెండ్ చేస్తూ ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ ఉత్తర్వులు జారీ చేశారు
గుంటూరు: గురజాల డీఎస్పీ శ్రీహరి, సీఐ దుర్గా ప్రసాద్లను సస్పెండ్ చేస్తూ ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ ఉత్తర్వులు జారీ చేశారు
కేసుల విచారణలో నిర్ల క్ష్యంగా వ్యవహరించినందున వీరిద్దరిని సస్పెండ్ చేస్తున్నట్టుగా డీజీపీ ప్రకటించారు. మరోవైపు వీరిద్దరి సస్పెన్షన్ వెనుక రాజకీయ కోణం కూడ ఉందనే ప్రచారం కూడ లేకపోలేదనే మరో వాదన కూడ విన్పిస్తోంది.
ఓ ప్రజాప్రతినిధి వ్యక్తిగత సహాయకుడి ఫోన్ కాల్ డేటాను మరో ప్రజాప్రతినిధికి అందించారని డీజీపీకి ఫిర్యాదు రావడంతో వీరిద్దరిని సస్పెండ్ చేసినట్టుగా ప్రచారం సాగుతోంది. ఫోన్ కాల్ డేటాను అనధికారికంగా ఇవ్వడం వల్లే ఉన్నతాధికారులు వీరిద్దరిపై వేటు వేసినట్టు అభిప్రాయపడుతున్నారు.
గుంటూరు జిల్లాలోని పలువురు పోలీసు అధికారుల తమ విదుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పాటు ఇతర కేసుల్లో ఇరుక్కోవడంతో సస్పెన్షన్ కు గురైన ఘటనలు గతంలో చోటు చేసుకొన్నాయి. తాజాగా ఇదే జిల్లాకు చెందిన డీఎస్పీ, సీఐలు కూడ సస్పెన్షన్ కు గురికావడం మరోసారి చర్చకు దారితీస్తోంది.