పేద కుటుంబాలకి పెద్ద కష్టం.. సీఎం వైఎస్ జగన్ ఔదార్యం, చికిత్సకు ఆర్ధిక సాయం

By Siva KodatiFirst Published Dec 3, 2022, 9:59 PM IST
Highlights

ఏపీ సీఎం వైఎస్ జగన్ తన ఔదార్యాన్ని చూపారు. వివిధ వ్యాధులతో బాధపడుతున్న రెండు కుటుంబాలకు ఆర్ధిక సాయం అందించేందుకు ఆయన హామీ ఇచ్చారు. 

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నారు. వివిధ వ్యాధులతో బాధపడుతున్న  అనంతపురానికి చెందిన ఓ రైతు, పులివెందులకు చెందిన ఇద్దరు చిన్నారుల మెరుగైన వైద్యం కోసం రెండు కుటుంబాలకు ఆర్ధిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. వివరాల్లోకి వెళితే.. అనంతపురం జిల్లా నార్పల మండలం గూగుడు గ్రామానికి చెందిన జగన్మోహన్ రెడ్డి అనే రైతు బ్రెయిన్ ట్యూమర్ వ్యాధితో బాధపడుతున్నాడు. 

అయితే నిరుపేద కుటుంబం కావడంతో ఆయన చికిత్సకు అవసరమైన మొత్తం లేక కుటుంబ సభ్యులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి భార్య శివజ్యోతి  తమ ముగ్గురు పిల్లలతో కలసి ముఖ్యమంత్రికి అర్జీ సమర్పించారు. నవంబర్ 12  నుండి ఆస్టర్ సి.ఎం.ఇ బెంగళూరు హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న తన భర్తకు రూ. 20 లక్షలు ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పారని.. అంత ఆర్ధిక స్తోమత తమకు లేదని మీరే ఆదుకోవాలని ముఖ్యమంత్రికి ఆమె విన్నవించింది. వారి దుస్థితిపై చలించిపోయిన సీఎం వైఎస్ జగన్ తక్షణమే రూ.2 లక్షలు మీ అకౌంట్‌లోకి వేస్తామని, చికిత్సకు అవసరమయ్యే పూర్తి ఖర్చు ప్రభుత్వమే భరించి చికిత్స అందిస్తామని భరోసా కల్పించారు. 

ఇక పులివెందులలో నివసిస్తున్న కె శివకుమార్, టైలరింగ్  చేసుకుంటూ భార్య జి.వరలక్షి, ఇద్దరు పిల్లలు  హైందవ్ ,  కుషల్‌లతో జీవనం సాగిస్తున్నామని తెలిపారు. అయితే తన ఇద్దరు పిల్లలు అనిమియా వ్యాధితో బాధపడుతున్నారని, వారికి రక్తం పెరుగుదలకు ఇంజక్షన్ వాడుతున్నామని జగన్ దృష్టికి తీసుకెళ్లారు. పిల్లల ఆరోగ్యం కోసం చెన్నై, బెంగళూరు వంటి మహా నగరాలకు తిరిగినా ప్రయోజనం దక్కలేదన్నారు. ఈ వ్యాధి ఆరోగ్య శ్రీ కిందకు రాదన్నారని ప్రస్తుతం హైదరాబాద్‌లోని అమెరికన్ అంకాలజిస్ట్ దగ్గర చికిత్స చేయిస్తున్నామని ఇప్పటికి రూ.15 లక్షలు ఖర్చు అయిందని శివకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. సర్వం కోల్పోయామని  మీరే మమ్మల్ని, మా పిల్లల్ని ఆదుకోవాలని ముఖ్యమంత్రిని కలసి అర్జీ సమర్పించారు. దీనిపై స్పందించిన సీఎం జగన్ పిల్లల ఆరోగ్యానికి మెరుగైన చికిత్స అందిస్తామని హామీ ఇచ్చారు.
 

click me!