చిన్నారిపై అత్యాచార ఘటన: జగన్ సీరియస్, సుచరిత మాట ఇదీ..

By telugu teamFirst Published Oct 26, 2019, 3:45 PM IST
Highlights

గుంటూరు జిల్లా దాచేపల్లి ప్రాంతంలో చిన్నారిపై జరిగిన అత్యాచార ఘటనపై ఏపీ సీఎం వైఎస్ జగన్ సీరియస్ గా స్పందించారు. అధికారులపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 24 గంటల్లోనే నిందితుడిని అరెస్టు చేశామని సుచరిత చెప్పారు.

అమరావతి: గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పెదగార్లపాడు గ్రామంలో చిన్నారిపై జరిగిన అత్యాచారం ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీరియస్ అయ్యారు. నిందితులను వదిలిపెట్టవద్దని, ఎంతటివారైన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన డీజీపీని, జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు. రాష్ట్రంలో మరెక్కడ కూడా ఇటువంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు బాధిత బాలికకు అండగా నిలుస్తామని చెప్పారు. 

లైంగిక దాడి జరిగిన 24 గంటల లోపలే నిందితుడిని అరెస్టు చేశారమని హోం మంత్రి సుచరిత చెప్పారు. చట్టపరంగా చర్యలు తీసుకోవాలని అదికారులను ఆదేశించినట్లు తెలిపారు. ప్రస్తుతం బాలిక ఆస్పత్రిలో కోలుకుంటోందని చెప్పారు. ప్రభుత్వం తరఫున బాధితురాలి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా చూస్తామని అన్నారు. 

Also Read: చిన్నారిపై ఆత్యాచారం... నిందితుడికి ప్రభుత్వ అండదండలు...: చంద్రబాబు

బాధిత బాలిక కటుంబాన్ని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ శుక్రవారం పరామర్శించారు. ప్రభుత్వం నుంచి సత్వరమే సాయం అందేలా చర్యలు తీసుకోవడంతో పాటు గ్రామంలో రక్షణ కూడా కల్పిస్తామని ఆమె భరోసా ఇచ్చారు. లైంగిక దాడికి గురై నరసరావుపేట వైద్యశాలలో చికిత్స పొందుతున్న బాలికను ఆమె పరామర్శించారు. సంఘటన గురించి బాలిక తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్నారు. 

సంఘటనపై జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద కుమార్ తో మాట్లాడినట్లు వాసిరెడ్డి పద్మ మీడియాతో చెప్పారు. బాధితులకు ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయిలో సహాయం అందేలా చొరవ తీసుకుంటామని చెప్పారు. బాలిక పరిస్థితి నిలకడగా ఉన్నప్పటికీ మెరుగైన చికిత్స కోసం గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించాలని సూచించినట్లు ఆమె తెలిపారు.

పల్నాడు ప్రాంతంలోని దాచేపల్లిలో గతంలో ఇటువంటి సంఘటనలు జరిగాయని, తిరిగి ఇటువంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. నిందితుడి వయస్సుపై వస్తున్న ఆరోపణలపై కూడా మహిళా కమిషన్ విచారిస్తుందని చెప్పారు. ప్రభుత్వం ఎవరిని కూడా వెనకేసుకుని రాదని చెప్పారు. 

click me!