పంద్రాగస్టు నుండే ఏపీలో ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్... సీఎం జగన్ ప్రకటన

Published : Jul 13, 2022, 05:20 PM IST
పంద్రాగస్టు నుండే ఏపీలో ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్... సీఎం జగన్ ప్రకటన

సారాంశం

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వైద్యారోగ్య శాఖపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కీలక ప్రకటన  చేసారు. 

అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ లో వైద్య సదుపాయాలను ప్రజలకు మరింత చేరువ చేయాలని వైద్యారోగ్య శాఖ ఉన్నఅధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు. ఇందుకోసమే రాష్ట్ర ప్రభుత్వం ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ను అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తోందని... దశలవారిగా రాష్ట్రంలో దీన్ని అమలు చేయాలని ఆదేశించారు. ఆగస్టు 15 నుంచి దీన్ని ప్రారంభించనున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు. 

ఇవాళ వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులతో సీఎం జగన్ క్యాంప్ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యారోగ్య శాఖకు సంబంధించి అధికారులకు పలు సలహాలు, సూచనలిచ్చారు. అలాగే కీలక అంశాలపై చర్చించి వాటి అమలుకు ఆదేశాలు కూడా ఇచ్చారు.

విలేజ్‌ క్లినిక్స్‌కు, పీహెచ్‌సీలకు డిజిటల్‌ వీడియో అనుసంధానత ఉండాలని సీఎం అధికారులకు సూచించారు. అలాగే ఆరోగ్యశ్రీ ద్వారా అందించే చికిత్సల జాబితాను పెంచాలని ఆదేశించారు. దీంతో పెంచనున్న చికిత్సల జాబితాను త్వరలోనే ఖరారుచేస్తామని అధికారులు సీఎంకు తెలిపారు. ఆగస్టు 1 నుంచి పెంచిన చికిత్సలను ఆరోగ్యశ్రీలో చేర్చేలా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు.  

ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు వర్చువల్‌ బ్యాంకు ఖాతాలు తెరవాలని సీఎం జగన్ సూచించారు. ఆరోగ్యశ్రీ కింద డబ్బులు నేరుగా రోగి వర్చువల్‌ బ్యాంకు ఖాతాలోకి... అక్కడ నుంచి ఆస్పత్రికి చెల్లింపులు జరగాలన్నారు.ఆస్పత్రిలో చేరిన రోగి నుంచి ముందుగా కన్సెంట్‌ ఫారం తీసుకుని... చికిత్స పూర్తయిన తర్వాత ధృవీకరణ పత్రం ఇవ్వాలన్నారు. ధృవీకరణ పత్రంలో వైద్యంకోసం ఆరోగ్యశ్రీ ద్వారా ప్రభుత్వం నుంచి అందిన సహాయం వివరాలు... రోగి కోలుకునేంతవరకూ ఆరోగ్య ఆసరా ద్వారా అందుతున్న సహాయం వివరాలు వుండాలన్నారు. రోగి నుంచి అదనంగా డబ్బులు వసూలు చేశారా? పూర్తి ఉచితంగా వైద్యం అందిందా? అన్న విషయాలను కూడా ధృవీకరించేలా పత్రం వుండాలన్నారు. ఎవరైనా లంచం లేదా అదనపు రుసుము వసూలు చేసిన నేపథ్యంలో ధృవీకరణ పత్రంలో ఫిర్యాదులకోసం ఏసీబీకి కేటాయించిన టోల్‌ఫ్రీ నంబర్‌ 14400 లేదా 104 ఉంచాలని సీఎం అధికారులకు సూచించారు. 

read more  ఒకరికి క్రెడిబిలిటీ లేదు.. మరొకరికి క్యారెక్టర్ లేదు : చంద్రబాబు, పవన్‌లపై మంత్రి కాకాని వ్యాఖ్యలు

రోగి ఆస్పత్రినుంచి డిశ్చార్జి అయిన వారం తర్వాత ఆరోగ్య సిబ్బంది సంబంధిత గ్రామానికి వెళ్లి ఆ వ్యక్తి ఆరోగ్య పరిస్థితిమీద విచారణ చేయాలని ఆదేశించారు. మరింత సహాయం అవసరమైన పక్షంలో సమన్వయం చేసుకుని ఆ సహాయం అందేలా చూడాలని సూచించారు. రోగికి అందిన సేవలు, అదనంగా కావాల్సిన మందులు, తదితర అంశాలపైన కూడా ఫోన్‌కాల్‌ ద్వారా ఫీడ్‌ బ్యాక్‌ తీసుకోవాలని సీఎం జగన్ సూచించారు. 

మరింత పటిష్టంగా 108, 104 సేవలు అందించాలని సీఎం ఆదేశించారు. 108, 104 లాంటి సర్వీసుల్లో కూడా లంచాలకు ఆస్కారం లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ వాహనాలపైన ఏసీబీ టోల్‌ ఫ్రీ నంబర్‌ ఉంచాలని సీఎం జగన్ ఆదేశించారు. 

ఇక రాష్ట్రంలో కోవిడ్‌ పరిస్థితులపైనా సీఎం అధికారులతో చర్చించారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా పూర్తిగా అదుపులో ఉందని అధికారులు సీఎంకు తెలిపారు. అక్కడక్కడా కోవిడ్‌ కేసులు ఉన్నా ఆస్పత్రిలో చేరుతున్నవారి సంఖ్య అతిస్వల్పమన్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా కేవలం 69 మంది మాత్రమే ఆస్పత్రుల్లో ఉన్నారని... వీరందరూ కూడా కోలుకుంటున్నారని అధికారులు సీఎంకు తెలిపారు. ఇప్పటికే 87.15శాతం మందికి ప్రికాషన్‌ డోసు వేశామని తెలిపారు. ప్రికాషన్‌ డోసు వ్యవధిని తగ్గించినందున వ్యాక్సినేషన్‌ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు. ముఖ్యంగా 60ఏళ్ల పైబడ్డ వారికి ప్రికాషన్‌ డోసు ఇచ్చే ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. ఈ క్రమంలో 15 నుంచి 17 ఏళ్ల మధ్య ఉన్నవారికి రెండోడోసు 99.69శాతం మందికి ఇచ్చామని...– 12 – 14 ఏళ్ల మధ్యనున్న వారికి 98.93 శాతం రెండో డోసు పూర్తిచేశామని అధికారులు సీఎంకు తెలిపారు. 

ఆస్పత్రుల సామర్థ్యానికి సరిపడా వైద్యులు, సిబ్బంది నియామకాలపైనా సీఎం అధికారులతో చర్చించారు.  రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 40,476 పోస్టులను ఈ ప్రభుత్వం వచ్చాక భర్తీచేశామని అధికారులు సీఎంకు తెలిపారు. జులై చివరినాటికల్లా సిబ్బంది నియామకాలు పూర్తిచేయాలని సీఎం ఆదేశించారు. ప్రాథమిక ఆరోగ్యం కేంద్రం నుంచి బోధనాసుపత్రి వరకూ కూడా ఉండాల్సిన సంఖ్యలో వైద్యులు, సిబ్బంది ఉండాలని స్పష్టంచేసారు. ఎక్కడా కూడా లోటుపాట్లు లేకుండా చూడాలని సీఎం జగన్ వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు.  

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?