కాలేజీల్లో ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏర్పాటు చేస్తామన్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్ . శుక్రవారం స్పందన కార్యక్రమంలో కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులతో జగన్ సమీక్ష నిర్వహించారు.
ప్రతి శనివారం హౌసింగ్ డేగా పరిగణించాలన్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్ . శుక్రవారం స్పందన కార్యక్రమంలో కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులతో జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డ్రగ్స్ నివారణ, నాడు-నేడు, పేదలందరికీ ఇళ్లు పథకాలపై రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో డ్రగ్స్ నివారణ చేపట్టాలని ఆదేశించారు. ప్రతి కాలేజీలో ఎస్ఈబీ టోల్ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయాలన్నారు. పేదలందరికీ ఇళ్లు కార్యక్రమానికి నిధులకు లోటు లేదని.. ఇళ్ల నిర్మాణం వల్ల ఆర్ధిక వ్యవస్థ బలోపేతం అవుతుందని జగన్ పేర్కొన్నారు. ప్రతి శనివారం హౌసింగ్ డేగా పరిగణించాలన్నారు. కాలేజీల్లో ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏర్పాటు చేస్తామన్నారు.
తల్లిదండ్రుల కమిటీల ఖాతాల్లో రూ.734.21 కోట్లు వున్నాయని.. పాఠశాలలలో డిజిటలీకరణ కూడా పూర్తవుతుందని జగన్ తెలిపారు. స్కూళ్లు జూన్ 21న తెరుస్తారని.. అదే రోజు విద్యా కానుక అందించాలని చెప్పారు. ఇందులో ఎలాంటి ఆలస్యానికి తావుండదని.. దాదాపు 43 లక్షల మందికి విద్యా కానుక అందుతుందని జగన్ చెప్పారు. మే 9న జగనన్నకు చెబుతాం కార్యక్రమం ప్రారంభమవుతుందని సీఎం తెలిపారు. చాలా ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని జగన్ వెల్లడించారు.