
పాఠశాల విద్యాశాఖలో తీసుకొస్తున్న సంస్కరణల వల్ల రాష్ట్రంలో ఒక్క పాఠశాల కూడా మూతపడకూడదన్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రంలోని పాఠశాలలు, అంగన్వాడీల్లో నాడు-నేడుపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ... విద్యా వ్యవస్థ మరింత ప్రభావవంతంగా మారేలా కార్యాచరణను అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.
స్కూళ్ల నిర్వహణ, టీచర్ల వినియోగంలో జాతీయ ప్రమాణాలు పాటించాలని జగన్ సూచించారు . పిల్లల సంఖ్యకు అనుగుణంగా టీచర్లు ఉండాలన్నారు. విద్యార్థులు తక్కువ.. టీచర్లు ఎక్కువ ఉన్న పాఠశాలల్లో అంగన్వాడీ పిల్లలను కలుపుకొనేలా చేస్తామని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు.
అవకాశం ఉన్నచోట మూడో తరగతి నుంచి ఐదో తరగతి వరకు ఉన్నత పాఠశాల పరిధిలోకి తీసుకురావాలని ప్రతిపాదించారు. వీటిని పరిశీలించిన ముఖ్యమంత్రి... రాష్ట్రంలో ప్రతి పాఠశాల కూడా వినియోగంలో ఉండాలని ఆదేశించారు.
Also Read:పేదలకు మెరుగైన వైద్యం: ఏపీ సీఎం వైఎస్ జగన్
అవసరమైనచోట అదనపు గదులు నిర్మించాలని సీఎం జగన్ సూచించారు. పిల్లలకు 2 కి.మీల దూరం లోపలే పాఠశాల ఉండాలన్నారు. పాఠశాలల నిర్వహణలో జాతీయ ప్రమాణాలను పాటించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
ప్రభుత్వం తీసుకొస్తున్న మార్పుల్లో టీచర్ల పాత్ర కీలకమని, వారిని ఆప్యాయతతో దగ్గరకు తీసుకొని సత్ఫలితాలు సాధించాలని జగన్ సూచించారు. అనంతరం అంగన్వాడీ ఉపాధ్యాయుల కోసం మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ రూపొందించిన స్పోకెన్ ఇంగ్లీష్ పుస్తకం, సీడీలను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు.