రాష్ట్రంలో కోవిడ్ 19 పరిస్థితులు, నివారణా చర్యలపై సీఎం జగన్ క్యాంపు కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు.
అమరావతి: రాష్ట్రంలోని అన్ని కోవిడ్ ఆస్పత్రుల్లో 37,441 బెడ్లు వుండగా... ఇప్పటికీ సాధారణ బెడ్లు 2,462, ఆక్సిజన్ సపోర్టుతో ఉన్న బెడ్లు 11,177, ఐసీయూ బెడ్లు 2,651 ఇంకా ఖాళీగానే ఉన్నాయని వైద్యారోగ్య శాఖ అధికారులు సీఎం జగన్ కు తెలిపారు. కానీ కొన్ని పత్రికలు కావాలనే తప్పుడు వార్తలు రాస్తున్నాయని వారు సీఎంకు వివరించారు.
రాష్ట్రంలో కోవిడ్ 19 పరిస్థితులు, నివారణా చర్యలపై సీఎం జగన్ క్యాంపు కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందులో వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, చీఫ్ సెక్రటరీ నీలం సాహ్ని, వైద్యారోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డితో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
కోవిడ్ ఆస్పత్రుల్లో ఇటీవల జరిపిన నియామకాలకు సంబంధించి వివరాలను సీఎంకు అందించారు అధికారులు. మొత్తం 30,887 పోస్టులకు గానూ 21,673 తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేసినట్లు పేర్కొన్నారు. రెగ్యులర్ రిక్రూట్మెంట్లో 9,971 పోస్టులను భర్తీ చేస్తున్నామని... అందులో 4,676 పోస్టుల నియామకం జరిగిపోయిందని మరో 5,295 పోస్టుల భర్తీకి ప్రక్రియ కొనసాగుతోందన్నారు. మరో 10 రోజుల్లో ఈ పోస్టుల భర్తీ పూర్తవుతుందని అధికారులు సీఎంకు తెలిపారు.
కోవిడ్ నియంత్రణ కోసం ప్రస్తుతం ప్రతిరోజూ రూ. 10.18 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు అధికారులు సీఎంకు తెలిపారు. కోవిడ్ టెస్టులకోసం రూ. 4.3 కోట్లు, ఆహారం కోసం రూ.1.31 కోట్లు,
మందులు కోసం రూ. 4.57 కోట్లు ఖర్చు చేస్తున్నామని అన్నారు.
read more నేను లారీ డ్రైవర్ని, నీవు సోడాలు అమ్మలేదా: దేవినేనిపై కొడాలి ఫైర్
ఈ సమావేశంలో అధికారులకు సీఎం జగన్ కూడా పలు సలహాలిచ్చారు. హెల్ప్ డెస్క్లను ప్రతి ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల్లో పెట్టాలని ఆదేశించారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని నీరుగార్చేలా ఆస్పత్రులు వ్యవహరిస్తే వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలి అధికారులకు సూచించారు. ఆరోగ్య మిత్రలతో హెల్ప్ డెస్క్లను ఏర్పాటుచేయాలి...ఎక్కడ తప్పులు జరిగినా వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. ఎంపానల్ట్ అయిన ప్రతి ఆస్పత్రిలోనూ హెల్ప్ డెస్క్ ఖచ్చితంగా ఉండాలని సీఎం స్పష్టం చేశారు.
ఇక రిఫరల్ విధానం చాలా సమర్థవంతంగా ఉండాలని సీఎం సూచించారు. కోవిడ్ ఆస్పత్రుపై ఎలాగయితే సమీక్ష చేస్తున్నామో అన్ని ఆరోగ్యశ్రీ ఆస్పత్రులు, ఎంపానల్డ్ ఆస్పత్రులపై సమీక్ష చేయాలని ఆదేశించారు. రోగులకు వైద్యం సరిగ్గా అందలేదంటే వారిని సరైన ఆస్పత్రికి పంపించే బాధ్యత ఆరోగ్య మిత్రలదేనని సీఎం అన్నారు.
ప్రతిరోజూ అధికారులు కాల్ సెంటర్లకు మాక్ కాల్ చేసి పనితీరును పరిశీలించాలని జగన్ సూచించారు. ప్రతి మాక్ కాల్పై వస్తున్న రెస్పాన్స్ను కూడా రికార్డు చేయాలన్నారు. ఆహారం, శానిటేషన్, డాక్టర్లు, మౌలికసదుపాయాలు.. ఈనాలుగు పారామీటర్స్ మీద ప్రశ్నలు వేసి రోగులనుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోవాలని... వీటి ఆధారంగా ఆస్పత్రులకు రేటింగ్ ఇవ్వాలని సూచించారు.
ఇక కొత్త వైద్య కళాశాలల నిర్మాణం కోసం వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం ఆదేశించారు. ప్రజారోగ్య వ్యవస్థను కొత్తగా తీసుకొస్తున్న కాలేజీలు బలోపేతం చేస్తాయన్న సీఎం జగన్ పేర్కొన్నారు.