ఖజానాపై 10 వేల కోట్ల భారం .. అయినా మీకోసం స్వీకరిస్తున్నా: ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో జగన్

Siva Kodati |  
Published : Jan 07, 2022, 05:48 PM IST
ఖజానాపై 10 వేల కోట్ల భారం .. అయినా మీకోసం స్వీకరిస్తున్నా: ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో జగన్

సారాంశం

నిన్నటి సమావేశం తర్వాత నా కుటుంబ సభ్యులైన ఉద్యోగుల ప్రతినిధులుగా మీరు చెప్పిన అన్ని అంశాలపైనా నిన్ననే సుదీర్ఘంగా కూర్చొని అధికారులతో చర్చించానని అన్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్ (Ys jagan) . ఉద్యోగులకు పీఆర్సీ (ap prc) ప్రకటిస్తూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. 

నిన్నటి సమావేశం తర్వాత నా కుటుంబ సభ్యులైన ఉద్యోగుల ప్రతినిధులుగా మీరు చెప్పిన అన్ని అంశాలపైనా నిన్ననే సుదీర్ఘంగా కూర్చొని అధికారులతో చర్చించానని అన్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్ (Ys jagan) . ఉద్యోగులకు పీఆర్సీ (ap prc) ప్రకటిస్తూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. పీఆర్సీని రెండు మూడు రోజుల్లో ప్రకటిస్తానని చెప్పానని.. కానీ నిర్ణయాన్ని ఎంత వీలైతే అంత త్వరగా చెప్తే మంచిదని భావించి ఈ మేరకు ఉదయం కూడా సమావేశం పెట్టానని జగన్ వెల్లడించారు. రాష్ట్ర విభజన వల్ల ఏర్పడ్డ సంక్లిష్ట సమస్యలు, కోవిడ్‌ కారణంగా తలెత్తిన ప్రతికూల పరిస్థితులు, ఒమైక్రాన్‌ ఎలాంటి ప్రభావం చూపుతుంది ?దేశ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల మీద ఎలాంటి ప్రభావం చూపబోతుందనే పరిస్థితుల మధ్య మనం ఉన్నామని ఆయన అన్నారు. ఇప్పటికే పీఆర్సీపై పలు దఫాలుగా చర్చలు జరిపానని ఉద్యోగులకు జగన్ వెల్లడించారు. 

చీఫ్‌ సెక్రటరీ కమిటీ ఇచ్చిన నివేదికలో పేర్కొన్న ప్రకారం 14.29 కంటే ఎంత మాత్రం కూడా ఇచ్చే పరిస్థితిలేదనే విషయాన్ని పదేపదే ఆర్థికశాఖ అధికారులు పలుదఫాలుగా చెప్పారని ముఖ్యమంత్రి ఉద్యోగులకు వివరించారు. మన ఆకాంక్షలు కూడా కాస్త తగ్గాలని కోరానని.. అదే సమయంలో ఉద్యోగుల ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకోవాలని సీఎస్‌, ఆర్థికశాఖ కార్యదర్శికీ చాలా సుదీర్ఘంగా చెప్పానన్నారు. ప్రభుత్వ పాలనలో ఉద్యోగులు ఒక భాగం, సంక్షేమం, అభివృద్ధి సంతృప్తికరంగా అందాలంటే.. ఉద్యోగుల సహాయ సహకారాలతోనే సాధ్యమని జగన్ పునరుద్ఘాటించారు. మా కుటుంబ సభ్యులుగానే మిమ్మల్ని అందర్నీ భావిస్తానని.. ఇది మీ ప్రభుత్వం ఈ భరోసా ఎప్పటికీ ఉండాలన్నదే నా భావన అన్నారు. నిన్న పీఆర్సీతో పాటు కొన్ని అంశాలు లేవనెత్తారని.. వాటిని కూడా పరిష్కరించే దిశగా సీఎస్‌తో, ఆర్థిక శాఖ అధికారులతో మాట్లాడానని జగన్ చెప్పారు. 

కోవిడ్‌ కారణంగా మరణించిన ఉద్యోగుల కుటుంబాల్లోని వారికి కారుణ్య నియామకాల (compassionate appointment) కింద ఉద్యోగాలు కల్పిస్తున్నట్లు సీఎం పేర్కొన్నారు. జూన్‌ 30 లోగా ఈనియామకాలన్నీ పూర్తి చేయాలని అధికారులను జగన్ ఆదేశించారు. ఈహెచ్‌ఎస్‌ – ఎంప్లాయిస్‌ హెల్త్‌ స్కీంకు సంబంధించిన సమస్యలు పరిష్కరించడానికి చీఫ్‌ సెక్రటరీ అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. 2 వారాల్లో సమస్యలు పరిష్కరించాలని ఆదేశాలు ఇచ్చానని... ఈ కమిటీ ఉద్యోగుల ప్రతినిధులతో మాట్లాడి, వారి సూచనలు, సలహాల ప్రకారం మంచి పాలసీ ఇస్తుందని సీఎం చెప్పారు.

సొంత ఇల్లులేని ప్రభుత్వ ఉద్యోగులకు – రాష్ట్ర ప్రభుత్వమే అభివృద్ధిచేస్తున్న జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్స్‌లో – ఎంఐజీ లే అవుట్స్‌లోని (jagananna smart township) ప్లాట్లలో 10శాతం ప్లాట్లను – రిజర్వ్‌చేయడమే కాకుండా 20శాతం రిబేటును ఇవ్వాలని నిర్ణయించామన్నారు. నియోజకవర్గాన్ని ఒక యూనిట్‌గా తీసుకుంటామని... ఉద్యోగులు ఎవ్వరికీ కూడా ఇంటిస్థలం లేదనే మాట లేకుండా చూస్తామని, ఆ రిబేటును కూడా ప్రభుత్వం భరిస్తుందని జగన్ వెల్లడించారు.

గ్రామ, వార్డు సచివాలయాల్లో (village ward secretariat)  పనిచేస్తున్న ఉద్యోగులందరికీ  జూన్‌ 30లోగా ప్రొబేషన్, కన్ఫర్మేషన్‌ ప్రక్రియను పూర్తిచేసి, సవరించిన విధంగా రెగ్యులర్‌ జీతాలను (న్యూ పేస్కేలు) ఈ ఏడాది జులై జీతం నుంచి ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చినట్లు సీఎం చెప్పారు. ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్‌ బకాయిలు, పీఎఫ్, జీఎల్‌ఐ, లీవ్‌ ఎన్‌క్యాష్‌మెంట్‌ తదితరాలన్నీ కూడా ఏప్రిల్‌నాటికి పూర్తిగా చెల్లించాలని ఆదేశించానని జగన్ పేర్కొన్నారు. పెండింగులో ఉన్న అన్ని డీఏలను ఒకేసారి జనవరి జీతంతో కలిపి ఇవ్వాలని ఆదేశించానన్నారు. ఈ నిర్ణయాల వల్ల ఏడాదికి రూ. 10,247 కోట్లు రాష్ట్ర ప్రభుతానికి అదనపు భారం పడుతున్నప్పటికీ ఉద్యోగులకు మంచి చేయాలని, ఈ బాధ్యతను స్వీకరిస్తున్నానని జగన్ చెప్పారు.
 

PREV
click me!

Recommended Stories

Holidays : ఈ వీకెండ్ రెండ్రోజులు సెలవులు... ఎందుకో తెలుసా..?
Revenue Minister Anagani Satya Prasad Key Comments at Collectors Conference | Asianet News Telugu