హెరిటెజ్‌ మజ్జిగపై సీబీఐ విచారణ: ఏపీ కేబినెట్ నిర్ణయాలివే

Siva Kodati |  
Published : Jun 11, 2020, 03:43 PM ISTUpdated : Jun 11, 2020, 03:48 PM IST
హెరిటెజ్‌ మజ్జిగపై సీబీఐ విచారణ: ఏపీ కేబినెట్ నిర్ణయాలివే

సారాంశం

హెరిటేజ్ మజ్జిగ ప్యాకెట్ల ద్వారా ఏడాదికి రూ.40 కోట్లు అక్రమాలు జరిగినట్లు తేలడంతో హెరిటేజ్ మజ్జిక ప్యాకెట్ల సరఫరా, ఖర్చులపై సీబీఐ విచారణ జరపాలని కేబినెట్ నిర్ణయించింది

తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఏపీ ఫైబర్ నెట్ ప్రాజెక్ట్‌లో భారీగా అవకతవకలు జరిగాయని మంత్రివర్గ ఉప సంఘం కేబినెట్‌కు నివేదికను సమర్పించింది. అర్హత లేని సంస్థలకు ప్రాజెక్టులను కట్టబెట్టారని కేబినెట్ సబ్ కమిటీ పేర్కొంది. సెటాప్ బాక్సుల కొనుగోళ్లలోనూ భారీ కుంభకోణం జరిగినట్లు పేర్కొంది.

ఫైబర్ నెట్‌లో సుమారు రూ.700 కోట్ల మేర అవినీతి జరిగిందని.. చంద్రన్న తోఫా, కానుక వంటి పథకాల ద్వారా రూ.158 కోట్ల అవినీతి జరిగిందని తెలిపింది. అలాగే హెరిటేజ్ మజ్జిగ ప్యాకెట్ల ద్వారా ఏడాదికి రూ.40 కోట్లు అక్రమాలు జరిగినట్లు తేలడంతో హెరిటేజ్ మజ్జిక ప్యాకెట్ల సరఫరా, ఖర్చులపై సీబీఐ విచారణ జరపాలని కేబినెట్ నిర్ణయించింది.

ఈ నెల 16 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరిపేందుకు మంత్రి మండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనిలో భాగంగా 16న బీఏసీ జరగనుంది. వైఎస్సార్ చేయూత పథకాన్ని ఏపీ కేబినెట్ ఆమోదించింది.

ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు నాలుగేళ్లలో రూ.50 వేల ఆర్ధిక సాయం అందనుంది. ఆగస్టు 12న వైఎస్సార్ చేయూత పథకం ప్రారంభం కానుంది. చిన్న వ్యాపారులకు ఆర్ధిక తోడ్పాటును అందించేందుకు జగనన్నతోడు పథకానికి కేబినెట్ ఆమోదం లభించింది.

దీనిలో భాగంగా సున్నా వడ్డీ కింద పదివేల రూపాయలు చిరు వ్యాపారులకు బ్యాంకు రుణాలు అందజేయనున్నారు. ఆగస్ట్ నుంచి జగనన్న తోడు పథకం ప్రారంభమవుతుందని మంత్రి పేర్ని నాని మీడియాకు తెలిపారు.

Aslo Read:బాబుకి షాక్: గత ప్రభుత్వ నిర్ణయాలపై సీబీఐ విచారణకు ఏపీ కేబినెట్ నిర్ణయం

పేదవారందరికీ వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకం కింద పౌష్టికాహారం అందివ్వాలని మంత్రివర్గం నిర్ణయించింది. కురుపాంలో ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజీ ఏర్పాటుకు ఆమోదించింది.

మచిలీపట్నం, గుంటూరు, శ్రీకాకుళంలో ఉన్న నర్సింగ్ కాలేజీల్లో 282 టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను మంజూరు చేస్తూ కేబినెట్ తీర్మానం చేసింది. ఏలూరు, ఒంగోలు, తిరుపతిలలో ఉన్న నర్సింగ్ స్కూల్స్‌లోనూ 144 టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను మంజూరు చేసింది.

తెలుగు, సంస్కృత అకాడమీల ఏర్పాటుకు నిర్ణయించింది. రామాయపట్నం పోర్ట్ నిర్మాణానికి సంబంధించి భూసేకరణకు మంత్రిమండలి ఆమోదించింది. గండికోట రిజర్వాయర్లో 26.85 టీఎంసీల నీళ్లను నిల్వ చేసే క్రమంలో ముంపునకు గురయ్యే ఏడు గ్రామాల ప్రజలకు నష్టపరిహారం అందజేసేందుకు గాను 522.85 కోట్ల నిధులను విడుదలకు పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది.

వెలిగొండ ప్రాజెక్ట్‌ భూసేకరణ, నష్టపరిహారం కోసం 14 వందల 11 కోట్ల 56 లక్ష రూపాయలను సైతం కేటాయించింది. ట్యాక్స్‌లను ఎగ్గొట్టే వారి ఆటకట్టించేందుకు గాను ఏపీ స్టేట్ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ఏర్పాటుకు, దానిలో 55 పోస్టులకు కూడా మంత్రిమండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆలయంలో తలుపులు తెరిచే సన్నిధి గొల్లలకు వారసత్వ హక్కు కల్పించేందుకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. 

PREV
click me!

Recommended Stories

రాజ్యసభలో రేణుకా చౌదరి Vs ఉప రాష్ట్రపతి | Andhra Pradesh Capital | Amaravati | Asianet News Telugu
అమరావతి పేరుతో కుంభకోణాలు.. అందుకేవ్యతిరేకిస్తున్నాం | YSRCP MP YV Subbareddy | Asianet News Telugu