అమిత్ షాను చంపాలనే అలిపిరి దాడి: కన్నా
బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాను చంపాలనే ఉద్దేశ్యంతోనే అలిపిరిలో ఆయనపై దాడికి పాల్పడ్డారన్నారు ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం, ప్రధానిపై విమర్శలకు నిరసనగా ఏపీ బీజేపీ ఇవాళ విజయవాడ ధర్నా చౌక్ వద్ద ఆందోళనకు దిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కన్నా చంద్రబాబు ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు.. నాలుగేళ్లు చంద్రబాబుతో కలిసి పనిచేయడం బీజేపీ కర్మని.. బాబు రాజకీయమంతా కుట్ర, వంచనే అని ఆరోపించారు.. అలిపిరిలో అమిత్ షాపై దాడి చేసి... మళ్లీ బీజేపీపైనే కేసులు పెట్టించారని విమర్శించారు.. బీజేపీపైనా.. మోడీపైనా విమర్శలు చేయడమే ముఖ్యమంత్రి పనిగా పెట్టుకున్నారని.. రాష్ట్రంలో మాఫీయా రాజ్యం నడుస్తోందని కన్నా వ్యాఖ్యానించారు.