రాజకీయంగానే విభేదాలు.. హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరే వుండాలి : జగన్‌కు విష్ణువర్థన్ రెడ్డి అల్టీమేటం

By Siva KodatiFirst Published Sep 27, 2022, 8:01 PM IST
Highlights

సంక్షేమ పథకాలకు బతికున్నవారి పేర్లను పెట్టడం ఏపీలోనే చూశామంటూ విష్ణువర్థన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయంగా విభేదిస్తాం కానీ.. తాము ఎవరి పేర్లు మార్చలేదని ఆయన గుర్తుచేశారు. 

ఆంధ్రప్రదేశ్‌లో సంక్షేమ పథకాలకు వాళ్ల పేర్లు పెట్టుకుంటున్నారంటూ మండిపడ్డారు రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్థన్ రెడ్డి. ఇప్పుడు యూనివర్సిటీల పేర్లు మార్చేస్తున్నారని.. 2014 నుంచి ఈ పేర్ల మార్పు సంస్కృతి వచ్చిందన్నారు. బతికున్నవారి పేర్లను పెట్టడం ఇక్కడే చూశామంటూ విష్ణువర్థన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయంగా విభేదిస్తాం కానీ.. తాము ఎవరి పేర్లు మార్చలేదని ఆయన గుర్తుచేశారు. మంత్రులు పిచ్చెక్కి మాట్లాడుతున్నారని.. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరే కొనసాగించాలని విష్ణువర్థన్ రెడ్డి డిమాండ్ చేశారు.  

అంతకుముందు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై సెప్టెంబర్ 21న ఆయన మాట్లాడుతూ.. ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్చిన వారు.. గుంటూరులోని జిన్నా టవర్ పేరు ఎందుకు మార్చారని ప్రశ్నించారు. జిన్నా టవర్ గురించి బీజేపీ స్పందించిన తర్వాత భయంతో రంగులు వేశారని.. పాకిస్తాన్ రంగు తీసేసి జాతీయ జెండా రంగు వేశారని, కానీ పేరు మాత్రం మార్చలేదని విష్ణువర్ధన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వేల మంది ఊచకోతకు కారణమైన వ్యక్తి జిన్నా అని.. గుంటూరులో తప్పించి భారతదేశంలో ఎక్కడా జిన్నా టవర్లు, జిన్నా సెంటర్లు లేవని విష్ణువర్థన్ రెడ్డి అన్నారు. చేతనైతే జిన్నా వంటి దేశద్రోహుల పేర్లు మార్చాలని ఆయన ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అసలు వైసీపీ ప్రభుత్వం దేశభక్తులకు అనుకూలమా.. లేక దేశద్రోహులకు అనుకూలమా అన్నది తేల్చుకోవాలని విష్ణువర్ధన్ రెడ్డి వ్యాఖ్యానించారు. 

ALso REad:ఎన్టీఆర్ పేరు కాదు.. దమ్ముంటే జిన్నా టవర్ పేరు మార్చండి : జగన్‌కు బీజేపీ నేత విష్ణువర్థన్ రెడ్డి సవాల్

కాగా.. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పు బిల్లుకు ఏపీ అసెంబ్లీ బుధవారం నాడు ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఈ బిల్లును ఏపీ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడుదల రజని ప్రవేశ పెట్టారు.  వైద్యరంగంలో సంస్కరణలకు వైఎస్ఆర్ శ్రీకారం చుట్టినందునే ఆయన పేరును ఈ హెల్త్ యూనివర్శిటీకి పెట్టాలని తాము భావించినట్టుగా మంత్రి చెప్పారు. ఎన్టీఆర్ ను చంద్రబాబు సర్కార్ కంటే తమ ప్రభుత్వమే గొప్పగా గౌరవించిందన్నారు. ఎన్టీఆర్ ను కించపర్చేలా గతంలో చంద్రబాబు వ్యాఖ్యలు చేశారని మంత్రి రజనీ ఈ సందర్భంగా చెప్పారు. 

click me!