ఢిల్లీకి ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి.. తాజా పరిణామాల నేపథ్యంలో టూర్‌పై ఉత్కంఠ..!

Published : Oct 08, 2023, 04:39 PM IST
ఢిల్లీకి ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి.. తాజా పరిణామాల నేపథ్యంలో టూర్‌పై ఉత్కంఠ..!

సారాంశం

ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు పలువురు ముఖ్య నేతలతో పురందేశ్వరి సమావేశం కానున్నారు.

ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు పలువురు ముఖ్య నేతలతో పురందేశ్వరి సమావేశం కానున్నారు. అయితే ఏపీలో నెలకొన్న తాజా పరిణామాల నేపథ్యంలో పురందేశ్వరి ఢిల్లీ పర్యటనపై ఉత్కంఠ నెలకొంది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత చోటుచేసుకున్న పరిణామాలు, ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్న పవన్ కల్యాణ్.. రానున్న ఎన్నికల్లో తమ జనసేన పార్టీ టీడీపీతో పొత్తులో ఉంటుందని ప్రకటించడం.. వంటి పరిణామాలు ఏపీ బీజేపీకి ఇబ్బందికరంగా మారాయి. 

అయితే పొత్తుల విషయంలో బీజేపీ హైకమాండ్‌దే తుది నిర్ణయమని దగ్గుబాటి పురందేశ్వరితో పాటు పలువురు పార్టీ సీనియర్ నేతలు చెబుతున్నారు. ఇక, తాజాగా పురందేశ్వరి నేతృత్వంలోని ఏపీ బీజేపీ కోర్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పొత్తులకు సంబంధించిన పార్టీ నాయకుల అభిప్రాయలపై చర్చించినట్టుగా తెలుస్తోంది. ఈ సమావేశంలో జనసేన, టీడీపీ కూటమితో కలిసి వెళ్లేందుకు కొందరు అనుకూలంగా మాట్లాడగా.. మరో వర్గం మాత్రం ఆ చర్చను తీవ్రంగా వ్యతిరేకించినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే జాతీయ నాయకత్వం స్పష్టమైన రోడ్‌మ్యాప్ ఇచ్చే వరకు పొత్తులపై స్పందించవద్దని పురంధేశ్వరి నేతలకు సూచించినట్లు తెలుస్తోంది. మరోవైపు చంద్రబాబు అరెస్ట్ వెనక బీజేపీ అధిష్టానం హస్తం ఉందని కొందరు టీడీపీ  నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. 

Also Read: చంద్రబాబు అరెస్ట్, టీడీపీ-జనసేన పొత్తు.. ఏపీలో బీజేపీకి విచిత్రమైన పరిస్థితి..!

ఈ పరిణామాల నేపథ్యంలో పురందేశ్వరి ఢిల్లీ టూర్ ప్రాధాన్యత సంతరించుకుంది. టీడీపీతో కలిసి వెళ్లేందుకు పవన్ నిర్ణయం తీసుకున్నప్పటికీ, ఎన్డీయే నుంచి జనసేన బయటకు రాలేదని చెబుతున్నారు. ఈ పరిణామాన్ని పురందేశ్వరి.. బీజేపీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది. అలాగే రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిణామాలు, రాష్ట్రంలోని బీజేపీ నేతల అభిప్రాయాలను కూడా హైకమాండ్ ముందు ఉంచే అవకాశాలు కనిపిస్తుంది. పురందేశ్వరి ఢిల్లీ పర్యటనలో ప్రధానంగా ఏపీకి సంబంధించి బీజేపీ పొత్తులు, రాజకీయ అజెండాపై ప్రధానంగా పార్టీ అధిష్టానంతో చర్చలు జరపనున్నట్టుగా సమాచారం. అయితే పురందేశ్వరి పర్యటన తర్వాత రాష్ట్రంలో బీజేపీ భవిష్యత్ కార్యచరణ, పొత్తులపై ఏ మేరకు క్లారిటీ వస్తుందనేది ఆసక్తికరంగా మారింది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

ఏబీఎన్ దాడిపై Somireddy Chandra Mohan Reddy Reaction | TDP VS YCP | Asianet News Telugu
AP Food Commission: రైస్ ముద్దవుతుంది.. ఇడ్లీ చట్నీలో నీరెక్కువ | Madhurawada | Asianet News Telugu