ఏపిలో మరో పడవ ప్రమాదం : తల్లీ కూతుళ్ల మృతి

First Published May 26, 2018, 9:44 AM IST
Highlights

వేట పడవను ఢీ కొట్టిన ఇసుక పడవ

ఆంధ్ర ప్రదేశ్ రాజదాని ప్రాంతంలో మరో పడవ ప్రమాదం చోటుచేసుకుంది. గుంటూరు జిల్లా బోరుపాలెం,అబ్బరాజుపాలెం మద్యలో కృష్ణా నదిలో రెండు బోట్లు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో నదిలో మునిగి ఓ చిన్నారితో పాటు ఆమె తల్లి మృతిచెందారు. 

ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం అడ్డరోడ్డుకు చెందిన మత్స్యకారుడు సైదరాజు కృష్ణా నదిలో చేపల వేటకు వెళ్లాడు. ఈయనతో పాటు భార్య మూడెళ్ల కూతురు కూడా పడవలో నదిలోకి వెళ్లారు. వీరు బోరుపాలెం సమీపంలో నదిలో వలేసి తెల్లవారుజామున బోటులోనే పడుకున్నారు. ఈ క్రమంలో అటువైపుగా వస్తున్న ఓ ఇసుక బోటు వీరు పడుకున్న బోటును ఢీ కొట్టింది. 

ఈ ప్రమాదంలో నదిలో బోటు బోల్తా పడటంతో తల్లీ కూతుళ్లు నదిలో మునిగిపోయారు. తండ్రి సైదరాజు ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకుని ప్రాణాలను కాపాడుకున్నాడు. ఇతడు స్థానికులకు,పోలీసులకు సమాచారం అందించడంతో వారు ప్రమాదస్థలానికి చేరుకుని నదిలో మునిగిన వారికోసం గాలింపు చేపట్టారు.

గల్లంతయిన తల్లీ కూతుళ్ల కోసం కృష్ణా నదిలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. నదిలో నాలుగు బోట్లతో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. అయితే ఇప్పటివరకు మృతదేహాలు లభ్యం కాలేదు. మృతదేహాలు ఒడ్డుకు కొట్టుకువచ్చాయేమోనన్న అనుమానంతో నదీతీర ప్రాంతాన్ని కూడా జల్లెడ పడుతున్నారు. 

click me!