చిత్తూరులో కీచక ఉపాధ్యాయుడు.. మోసం చేసి మైనర్ విద్యార్థినితో పెళ్లి.. 33 ఏళ్ల టీచర్ అరెస్టు

By Mahesh KFirst Published Apr 2, 2023, 1:08 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరులో 33 ఏళ్ల కీచక టీచర్ తాను పాఠాలు బోధిస్తున్న 17 ఏళ్ల మైనర్ బాలికను మోసపూరితంగా పెళ్లి చేసుకున్నాడు. అబద్ధాలు చెప్పి తిరుపతికి తీసుకెళ్లాడు. ఓ ఆలయంలో పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత తాను మోసపోయినట్టు బాలిక గ్రహించి తల్లిదండ్రులకు సమాచారం చెప్పింది. నిందితుడికి భార్య, ఒక కూతురు ఉన్నారు.
 

చిత్తూరు: ఆంధ్రప్రదేశ్‌లో బుద్ధి మాటలు చెప్పాల్సిన ఉపాధ్యాయుడు గడ్డి తిన్నాడు. తాను పాఠాలు బోధించాల్సిన విద్యార్థినిలో తప్పుడు ఆలోచనకు బీజం వేశాడు. ఆమెను అబద్ధాలతో మోసం చేశాడు. నమ్మించి తిరుపతికి తీసుకెళ్లి.. ఓ దేవాలయంలో మోసపూరితంగా పెళ్లి చేసుకున్నాడు. ఈ ఘటన చిత్తూరు జిల్లా గంగవరం మండలం ఏరియాలో చోటుచేసుకుంది. నిందిత ఉపాధ్యాయుడిని పోలీసులు అరెస్టు చేశారు.

33 ఏళ్ల చలపతిపై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్టు పోలీసు అధికారులు వివరించారు. చలపతి ఓ ప్రైవేటు కాలేజీలో పని చేస్తున్నాడని తెలిపారు. ఆయనకు అప్పటికే పెళ్లైంది. ఒక కూతురు కూడా ఉన్నది. ఆ తర్వాతే 12వ తరగతి చదువుతున్న 17 ఏళ్ల బాలికను తప్పుదారి పట్టించాడు.

బుధవారం ఆ బాలికకు ఫైనల్ ఎగ్జామ్స్ పూర్తయ్యాయి. ఆ తర్వాత చలపతి ఆమెను అబద్ధాలతో నమ్మించి తిరుపతికి తీసుకెళ్లాడు. తాను నిజాయితీపరుడినని, తనపై విశ్వాసం ఉంచాలని బాలికను నమ్మించాడు. ఆమె పట్ల అన్ని జాగ్రత్తలు తీసుకుంటానని నమ్మబలికినట్టు ఎస్ఐ సుధాకర్ రెడ్డి ఏఎన్ఐ న్యూస్ ఏజెన్సీకి తెలిపారు.

Also Read: ఉపాధ్యాయుడి కీచక పర్వం..ఎనిమిదేండ్ల చిన్నారిపై లైంగిక వేధింపులు.. ఆపై..

అక్కడే ఓ ఆలయంలో వారిద్దరికి పెళ్లి జరిగింది. ఆ తర్వాత చలపతి ప్రవర్తనలో మార్పును బాలిక గమనించింది. వెంటనే ఆ బాలిక మొత్తం ఉదంతాన్ని ఆమె తల్లిదండ్రులకు తెలిపింది. బాలిక తన తల్లిదండ్రులతో గంగవరం పోలీసు స్టేషన్‌కు వెళ్లి గురువారం రాత్రి ఫిర్యాదు చేశారు. పోలీసులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. 

నిందితుడిని అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపరిచినట్టు పోలీసులు తెలిపారు.

click me!