Southern Zonal Council: జల వివాదాలతో పాటు ఏపీ అంశాలను ప్రస్తావించనున్న జగన్

By narsimha lodeFirst Published Nov 14, 2021, 12:05 PM IST
Highlights


తిరుపతి వేదికగా జరిగే దక్షిణాది రాష్ట్రాల జోనల్ కౌన్సిల్ సమావేశంలో ఏపీ సీఎం వైఎస్ జగన్  రాష్ట్రానికి చెందిన  పలు అంశాలను ప్రస్తావించనున్నారు. తెలంగాణ రాష్ట్రంతో  ఉన్న జలవివాదాలు, రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీల అమలు విషయాన్ని కూడా చర్చించనున్నారు.


తిరుపతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పలు సమస్యలను 29వ సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ప్రస్తావించాలని ఏపీ సీఎం జగన్ నిర్ణయం తీసుకొన్నారు. దక్షిణాది ప్రాంతీయ మండలి 29వ సమావేశం ఎజెండాలో మొత్తం 26 అంశాల్ని పొందుపరిచారు. గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన చర్యల నివేదికలు రెండింటితోపాటు 24 కొత్త అంశాల్ని చర్చకు చేపడతారు. ఇందులో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిపాదించిన అంశాలు ఏడున్నాయి. మూడు రాజధానుల సమగ్రాభివృద్ధికి కేంద్రం ఉదారంగా నిధులివ్వాలని, గతంలో ఇస్తామని చెప్పిన రూ.2,500 కోట్లలో మిగతా రూ.వెయ్యి కోట్లను విడుదల చేయాలని కోరనుంది. విభజన చట్టంలో పొందుపరిచిన వివిధ అంశాలపైనా చర్చించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది.

Southern Zonal Council లో ఏపీ  సీఎం జగన్ స్వాగతోపాన్యాసం చేయనున్నారు.ఈ ప్రసంగంలో ప్రధానంగా రాష్ట్రానికి చెందిన సమస్యలను ఏపీ సీఎం Ys Jagan ప్రస్తావించనున్నారు.ఆదివారం నాడు Tirupatiలో కేంద్ర హోంశాఖ మంత్రి Amit Shah అధ్యక్షతన సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం  జరగనుంది. ఇవాళ మధ్యాహ్నం 3 గంటల నుండి రాత్రి ఏడున్నర గంటల వరకు ఈ సమావేశం కొనసాగుతుంది.

also read:పట్టు పంచె, నుదుట తిలకం... అచ్చతెలుగు వస్త్రధారణలో అమిత్ షా... శ్రీవారి ధర్శనం (ఫోటోలు)

రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా, వివిధ పెండింగ్‌ సమస్యలను ప్రస్తావించి త్వరగా పరిష్కరించాలని సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో సీఎం కోరనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వర ప్రసాదినిగా పేరొందిన పోలవరం ప్రాజెక్టుకు చెందిన బకాయిలు, తెలంగాణా నుంచి రావాల్సిన రూ.6,300 కోట్ల విద్యుత్‌ బకాయిల కోసం ఏపీ కొంత కాలంగా ఒత్తిడి తీసుకొస్తోంది.ఈ విషయమై ఈ సమావేశంలో ప్రస్తావించనున్నారు సీఎం జగన్.రాష్ట్ర విభజన జరిగిన ఆర్థికంగా ఏర్పడిన రెవిన్యూ లోటు కింద రావాల్సిన నిధుల అంశాన్ని ప్రస్తావించనుంది ఏపీ సర్కార్. రేషన్‌ బియ్యంలో హేతు బద్ధతలేని కేంద్రం కేటాయింపులను కూడా ప్రస్తావించే అవకాశం ఉంది. తెలంగాణ నుంచి రావాల్సిన సివిల్‌ సప్లయిస్ బకాయిల అంశాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ సర్కార్ ప్రస్తావించనుంది.Krmb పరిధిలోకి జూరాల ప్రాజెక్టును తీసుకురావడాన్ని ప్రస్తావించనుంది. నదుల అనుసంధానంపై కేంద్రం ప్రతిపాదనల ప్రస్తావించనున్నారు సీఎం జగన్. రాష్ట్రానికి మేలు జరిగే వీలైనంత త్వరగా సాకారం అయ్యే ప్రణాళికలు, రాష్ట్రం సూచిస్తున్న ప్రత్యామ్నాయాలను సీఎం ఈ సమావేశంలో వివరించనున్నారు. తెలంగాణ రాష్ట్రంతో ఉన్న నీటి వివాదాలను కూడ ఈ సమావేశంలో జగన్ ప్రస్తావించే అవకాశం ఉంది. 

ఈ సమావేశం తిరుపతిలోని తాజ్‌హోటల్‌లో మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 7 గంటల వరకు ఇది జరుగుతుంది. అనంతరం అతిథుల గౌరవార్థం ఏపీ సీఎం జగన్‌ విందు ఇస్తున్నారు. అమిత్‌షా శనివారం సాయంత్రమే తిరుపతి చేరుకున్నారు. ముఖ్యమంత్రి జగన్‌ ఆయనకు స్వాగతం పలికారు. తెలంగాణ ముఖ్యమంత్రి Kcr ఈ సమావేశానికి హాజరవడంలేదు. హోం మంత్రి మహమూద్‌ అలీ, సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ వస్తున్నట్టు సమాచారం. తమిళనాడు సీఎం Stalin ఆదివారం సొంత నియోజకవర్గం పర్యటనకు వెళుతున్నందున రావడం లేదు. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై ఆదివారం ప్రత్యేక విమానంలో వస్తున్నారని తెలిసింది. కేరళ నుంచి ఆర్థిక మంత్రి, సీఎస్‌ హాజరవుతున్నారు. లక్షద్వీప్‌ పరిపాలనాధికారి, అండమాన్‌ నికోబార్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్లు, సీఎస్‌లు, ముఖ్య అధికారులు శనివారమే తిరుపతికి చేరుకున్నారు. పుదుచ్చేరి సీఎం ఎన్‌.రంగస్వామి హాజరుకానున్నారు. రాష్ట్రాల ప్రతినిధుల ప్రసంగాల తర్వాత కేంద్ర హోం మంత్రి మాట్లాడతారు.

రాష్ట్రాల పునర్‌వ్యవస్థీకరణ చట్టం–1956 ప్రకారం ఐదు జోనల్‌ కౌన్సిల్స్‌ ఏర్పాటయ్యాయి. దక్షిణాది రాష్ట్రాలతో ఏర్పడ్డ కౌన్సిల్‌ ఐదోది.రాష్ట్రాల మధ్య సహృద్భావ వాతావరణం, కేంద్రం –రాష్ట్రాల మధ్య చక్కటి సంబంధాలను నెలకొల్పే ప్రయత్నంలో భాగంగా జోనల్‌ కౌన్సిల్స్‌ను ఏర్పాటు చేశారు.  మొట్టమొదటి సౌత్‌ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశం 1957 జులై 11న మద్రాసులో నిర్వహించారు. మొత్తంగా ఇప్పటి వరకూ 28 సార్లు దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండళ్ల సమావేశాలు జరిగాయి. చివరగా 2018 సెప్టెంబరు 18,న సౌత్‌ జోనల్‌ కమిటీ సమావేశం బెంగళూరులో జరిగింది. 
 

click me!