
నేర చరిత్ర గలవారికి టీటీడీ బోర్డులో పదవులు ఇవ్వడంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు (Andhra Pradesh High Court) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నేరచరిత్ర ఉన్న వారిని బోర్డు సభ్యులుగా నియమించడంపై బీజేపీ నేత భానుప్రకాష్రెడ్డి (Bhanu Prakash Reddy) హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేసు వివరాలను పిటిసన్ తరపు లాయర్ అశ్వనీకుమార్ (Aswini Kumar) హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా (Justice Prasanth Kumar Mishra) నేతృత్వంలోని ధర్మాసనానికి వివరించారు. ఈ క్రమంలోనే నేరచరిత్ర ఉన్నవారిని టీటీడీ బోర్డు సభ్యులుగా ఎలా నియమిస్తారని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. మీకేదో లబ్ధి జరగడం వల్లే ఇలా చేస్తున్నారని వ్యాఖ్యానించింది.
అశ్వనీకుమార్ వాదనల్లో ప్రాథమిక సాక్ష్యాలున్నాయని భావిస్తున్నామని హైకోర్టు ధర్మాసం పేర్కొంది. అందరినీ తొలగించలేకపోయినా కనీసం కొంత మందినైనా తొలగించాల్సిందేనని స్పష్టం చేసింది. టీటీడీ భవనం కలెక్టరేట్ అవసరాలకు వాడుకుంటే..విధానపరమైన నిర్ణయం కాబట్టి సమర్థించామని తెలిపింది. నేరచరిత్ర ఉన్న సభ్యులు పాలకవర్గంలో ఉండొద్దని పేర్కొంది. ఏప్రిల్ 19న వాదనలు వింటామని.. అదే రోజు నిర్ణయం తీసుకుంటామని హైకోర్టు ధర్మాసనం తెలిపింది. ఇక ఎట్టి పరిస్థితుల్లో మినహాయింపులు ఉండబోవని స్పష్టం చేసింది.