అమరావతి: లాక్ డౌన్ పొడిగించిన నేపథ్యంలో 10వ తరగతి పరీక్షలు ప్రస్తుతం నిర్వహించే పరిస్థితులు లేవని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కోన్నారు. అయితే పరీక్షలు జరిగేంత వరకు విద్యార్థులు చదువును నిర్లక్ష్య చేయకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు మంత్రి వెల్లడించారు.
ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల మేరకు ప్రభుత్వానికి చెందిన సప్తగిరి ఛానల్ ద్వారా పదో తరగతి విద్యార్థుల కోసం పాఠాలు ప్రసారం చేయనున్నట్లు వెల్లడించారు. రోజూ ఉదయం 10 నుండి 11 గంటల వరకు, సాయంత్రం 4నుండి 5 గంటల వరకు ఇవి ప్రసారం అవుతాయన్నారు. అంతేకాకుండా ఇవే క్లాసులను సప్తగిరి యూట్యూబ్ ఛానల్ లో కూడా అందుబాటులో ఉంచుతామన్నారు.
విద్యామృతం పేరుతో ఈ కార్యక్రమం రూపొందించామని...అన్ని శాఖల పరిధిలోని స్కూల్స్ నుంచి అధ్యాపకులను ఎంపికచేసి పాఠాలు చెప్పించనున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే ట్రయిల్ రన్ చేసినట్లు తెలిపారు. పరీక్షలు జరిగే వరకు విద్యార్థులు సమయాన్ని వృధా చేయకుండా ఈ క్లాసులను వినియోగించుకోవాలని సూచించారు. ఆన్లైన్ లో పాఠాలు చెప్పడానికి ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల నుండి చాలామంది ఉపాధ్యాయులు ఉత్సాహంగా ముందుకువచ్చారని మంత్రి సురేష్ వెల్లడించారు.