ఆనందయ్య కరోనా మందు: ఏపీ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్

By narsimha lodeFirst Published May 24, 2021, 4:58 PM IST
Highlights

ఆనందయ్య మందును  ప్రజలకు అందించేలా చర్యలు తీసుకోనేలా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ఏపీ  హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలైంది. 

అనంతపురం: ఆనందయ్య మందును  ప్రజలకు అందించేలా చర్యలు తీసుకోనేలా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ఏపీ  హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలైంది. అనంతపురం జిల్లాకు చెందిన   ఉమా మహేశ్వరనాయుడు తరపున  న్యాయవాది బాలాజీ  సోమవారం నాడు ఈ విషయమై హైకోర్టును ఆశ్రయించాడు. కరోనా నివారణకు ఆనందయ్య ఆయుర్వేద మందు ఇస్తున్నారని పిటిషనర్ పేర్కొన్నారు.ఆనందయ్య తయారు చేస్తున్న మందును రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేసిందని పిటిషనర్ ఆరోపించారు. ఈ విషయమై విచారణ జరపాలని ఆయన కోరారు. 

also read:ఆనందయ్య మందు: 500 మంది నుండి డేటా సేకరించనున్న ఆయుర్వేద సంస్థ

ఇదిలావుంటే, బొనిగె ఆనందయ్య ఇస్తున్న మందు పరిశీలనకు సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రిసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్స్ (సీసీఆర్ఎఎస్) రంగంలోకి దిగింది. ఆనందయ్య ఇస్తున్న మందు ఆయుర్వేదమా, కాదా అనే విషయాన్ని ఆ సంస్థ తేలుస్తుందని అంటున్నారు. ఆయుష్ అధికారులు జరిపిన పరిశోధనలను ఢిల్లీ అధికారులకు పంపించారు 

ఆయుష్ బృందం ఆనందయ్య ఇస్తున్న మందును నాలుగు దశల్లో పరిశీలించింది. ఈ పరిశీలన తర్వాత ఆయుష్ కమిషనర్ రాములు మందుపై స్పందించారు. ఆనందయ్య ఇస్తున్న మందు హానికరం కాదని ఆయన స్పష్టం చేశారు. అయితే అది ఆయుర్వేదం కాదని, నాటు మందు మాత్రమేనని చెప్పారు. అయితే, బొనిగె ఆనందయ్య ఆ వాదనతో విభేదించారు. తన మందు ఆయుర్వేదమేనని ఆయన చెప్పారు దాదాపు 60 వేల మంది ఆనందయ్య మందు తీసుకున్నారని, వారంతా కోలుకున్నారని, సైడ్ ఎఫెక్ట్స్ లేవని చెప్పారని తేల్చారు. 

ఆయుష్ విభాగం తన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించనుంది. ఆ నివేదికను అందుకున్న తర్వాత మందు పంపిణీపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకోనుంది. ఇప్పటి వరకు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఆనందయ్య మందుకు అనుకూలంగానే మాట్లాడారు. ఆనందయ్య మందును పంపిణీపై జగన్ ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. 

కరోనాకు నెల్లూరు జిల్లా ముకునూరు మండలం కృష్ణపట్నంలో బొనిగె ఆనందయ్య మందు ఇస్తూ వచ్చారు. ఆయన ఇస్తున్న మందుపై విస్తృతమైన ప్రచారం జరగడంతో కృష్ణపట్నానికి వేలాదిగా ప్రజలు రావడం ప్రారంభమైంది. ఆయన మందు కోసం తోపులాట కూడా జరిగింది. ఈ స్థితిలో ప్రభుత్వం రంగంలోకి దిగింది. 

కోటయ్య అనే స్కూల్ రిటైర్డ్ హెడ్ మాస్టర్ కోటయ్య వీడియో విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. కోటయ్య మందుతో తన ఆక్సిజన్ సాచ్యురేషన్ లెవెల్స్ పెరిగాయని ఆయన చెప్పారు. దాంతో తాను పూర్తిగా కోలుకున్నానని చెప్పారు. అయితే, ఆ తర్వాత అది వికటించి, కోటయ్య అస్పత్రిలో చేరారని ప్రచారం సాగింది. అయితే, అది నిజం కాదని ఆ తర్వాత తేలింది. ఈ నేపథ్యంలో ఆనందయ్య ఇస్తున్న కరోనా మందుకు విశ్వసనీయత పెరిగింది.

నెల్లూరు జిల్లా కృష్ణపట్టణానికి చెందిన ఆనందయ్య మందును పంపిణీ చేస్తున్నారు. ఈ మందు కరోనాను తగ్గిస్తోందనే ప్రచారం సాగింది. దీంతో వందలాది మంది కృష్ణపట్టణానికి ప్రతి రోజూ వచ్చేవారు. జనాన్ని కట్టడి చేయడం పోలీసులకు ఇబ్బందిగా మారింది.  జాతీయ ఆయుర్వేద పరిశోధన సంస్థ ఆనందయ్య తయారు చేస్తున్న మందును  పరిశీలిస్తోంది. ఈ మందుతో ఎలాంటి దుష్ప్రభావాలు లేవని ఏపీ రాష్ట్ర ఆయుష్ కమిషనర్ రాములు ఇప్పటికే ప్రకటించారు. ఆయుష్ కమిషనర్  రాములు ఇవాళ సీఎంఓ అధికారులతో భేటీ అయ్యారు.  

click me!