నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలి.. ఆ పోలీసు అధికారులను బదిలీ చేయాలి : టీడీపీ

Published : Dec 19, 2022, 03:58 AM IST
నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలి.. ఆ పోలీసు అధికారులను బదిలీ చేయాలి : టీడీపీ

సారాంశం

Vijayawada: హింస చెలరేగి టీడీపీ కార్యాలయం, నేతలపై దాడి జరిగిన తర్వాత పోలీసు అధికారులు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆరోపించారు. హింసను చిన్న సంఘటనలు అని ఎస్పీ అభివర్ణించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.  

Telugu Desam Party (TDP): రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ (డీజీపీ) కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి వెంటనే మాచర్లను సందర్శించి హింసాత్మక ఘటనపై నిష్పాక్షిక విచారణకు ఆదేశించాలని తెలుగుదేశం పార్టీ  (టీడీపీ) సీనియర్ నేత, పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య డిమాండ్ చేశారు. హింసకు పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలనీ, అదనపు డీజీ (ఇంటెలిజెన్స్), ఎస్పీ, ఇతర పోలీసు అధికారులను బదిలీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మాచర్లలో హింస చెలరేగి టీడీపీ కార్యాలయంపై దాడి చేసిన తర్వాత పోలీసులు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని ఆయ‌న ఆరోపించారు. మాచర్లలో జరిగిన హింసాకాండ బాధితులను పరామర్శించేందుకు టీడీపీ నేతలను ఎందుకు అనుమతించడం లేదని ప్రశ్నించారు. మాచర్లలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించిన తర్వాత కూడా అధికార వైసీపీ కార్యకర్తలు మారణాయుధాలు, పెట్రోల్, ఇతర ఆయుధాలతో నింపిన బాటిళ్లను తీసుకెళ్లడానికి ఎలా అనుమతిస్తున్నారని ఆయన ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

మాచర్లలో జరిగిన హింస ప్రభుత్వ ప్రాయోజితమేననీ, ఇంటెలిజెన్స్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ సీతారామాంజనేయులు, పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి హింసను ప్రేరేపించారని బాధితులు భావిస్తున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు తెలిపారు. వైసీపీ కార్యకర్తలను కాపాడేందుకే ఎస్పీ ఈ మొత్తం ఎపిసోడ్ ను తక్కువ చేసి చూపేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. స్థానిక టీడీపీ కార్యాలయానికి నిప్పు పెట్టడంతో పాటు రెండు కార్లు దగ్ధమయ్యాయనీ, స్థానిక టీడీపీ కార్యకర్తల ఇళ్లు కూడా ధ్వంసమయ్యాయని తెలిపారు. అయితే, దీనిని చిన్న సంఘటనగా ఎస్పీ అభివర్ణించారు. ఈ ఘటనల గురించి ఎస్పీకి ముందే తెలుసునని ఇది సూచిస్తోందని రామయ్య వ్యాఖ్యానించారు. ఎస్పీ తీరుపై మండిప‌డ్డారు. 

బాధితులైన టీడీపీ కార్యకర్తలపై నాన్ బెయిలబుల్ హత్యాయత్నం వంటి తీవ్రమైన సెక్షన్ల కింద కేసులు నమోదు కాగా, వైసీపీ కార్యకర్తలపై బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఇది ఎస్పీ పక్షపాత వైఖరిని ప్రతిబింబిస్తుందని వ‌ర్ల‌ రామయ్య అన్నారు. ఇంత చిన్న ఘటనలు జరిగితే సెక్షన్ 144 కింద నిషేధాజ్ఞలు ఎందుకు విధించారని ప్రశ్నించారు. స్థానిక పోలీసుల వేధింపులు భరించలేక టీడీపీ నేతలు మాచర్ల నుంచి వెళ్లిపోతున్నారనీ, ఇప్పటి వరకు ఏ పోలీసు అధికారి సంఘటనా స్థలాన్ని సందర్శించలేదనీ, వీడియో ఫుటేజీని పరిశీలించలేదని ఆయన అన్నారు. హింసలో పాల్గొన్న వారిని కూడా శిక్షించాలని రామయ్య డిమాండ్ చేశారు. వారిని వెంట‌నే అరెస్టు చేయ‌డంతో పాటు ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీ, ఎస్పీ, ఇతర పోలీసు అధికారులను బదిలీ చేయాలని ఆయ‌న డిమాండ్  చేశారు. 

ప్రభుత్వ ప్రేరేపిత హింస..

"స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం (ప్రభుత్వ ప్రేరేపిత హింస)... ప్రభుత్వమే రౌడీలను దింపి దాడులు చేయించి, విధ్వంసం సృష్టించి ప్రజలను భయపెట్టడం... ఏపీలో జరుగుతున్న వింత. జగన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, ఇంటెలిజెన్స్ అదనపు డీజీల‌ ఆదేశాలపై పల్నాడు ఎస్పీ నిన్న మాచర్లలో చేసింది ఇదే.." నంటూ తెలుగుదేశం పార్టీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించింది. 

 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

స్వాతంత్య్ర వేడుకల్లో నారా లోకేష్ పవర్ ఫుల్ స్పీచ్ | Nara Lokesh Independence Day Speech 2026
CM Chandrababu Full Speech At 80th Independence Day Celebrations | Asianet Telugu