ఆంధ్ర ప్రదేశ్ లో సొంతిల్లు లేనివారు హైదరాబాద్ లో ఎవరింటికి ఎవరు వెళితేనేం... అంటూ నిన్న టిడిపి అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ భేటీపై మంత్రి అంబటి సెటైర్లు వేసారు.
అమరావతి : తెలుగుదేశం, జనసేన పార్టీలు ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల్లో కలిసి పోటీచేస్తామని ప్రకటించాయి. ఈ క్రమంలోనే ఇరుపార్టీల సమన్వయం, ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పనకు చర్చలు జరుగుతున్నాయి. దీంతో పాటు రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు టిడిపి అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. అయితే వీరు హైదరాబాద్ లో సమావేశంపై ఏపీ రాజకీయాలపై చర్చించడంపై మంత్రి అంబటి రాంబాబు సెటైర్లు వేసారు.
ఆంధ్ర ప్రదేశ్ లో చంద్రబాబు, పవన్ కల్యాణ్ లకు సొంత ఇళ్లు లేవని గుర్తుచేస్తూ అంబటి కామెంట్స్ చేసారు. రాష్ట్రంలో ఇల్లు లేనివారు ఎవరింటికి ఎవరు వెళితే ఏంటి... చివరకు వాళ్లు స్థిరపడేది అక్కడేనంటూ చంద్రబాబు, పవన్ భేటీపై సెటైరికల్ గా స్పందించారు అంబటి.
ఇక చంద్రబాబు, పవన్ కల్యాణ్ భేటీకి సంబంధించిన వివరాలు వెల్లడిస్తూ నాదెండ్ల మనోహర్ చేసిన కామెంట్స్ కు అంబటి కౌంటర్ ఇచ్చారు. వైసిపి విముక్త ఆంధ్ర ప్రదేశ్ ను ప్రజలు కోరుకోవడం కాదు నాదెండ్ల విముక్త జనసేనను జనసైనికులు కోరుకుంటున్నారంటూ ఎద్దేవా చేసారు. నాదెండ్ల నుండి జనసేనను కాపాడేవాడే అసలైన జనసైనికుడని అంబటి అన్నారు.
Also Read Nadendla Manohar: "వైసీపీ విముక్త రాష్ట్రమే మా లక్ష్యం"
ఇక పవన్, చంద్రబాబు మధ్య హైదరాబాద్ వేదికన జరిగిన సమావేశం చాలా సంతృప్తికరంగా సాంగిందన్న నాదెండ్ల కామెంట్స్ పైనా మంత్రి రియాక్ట్ అయ్యారు. ఇరు పార్టీల గురించి చర్చ జరిగిందో లేదో తెలీదు కానీ నాదెండ్ల సంతృప్తి చెందేలా చర్చలు జరిగివుంటాయని మంత్రి అంబటి ఎద్దేవా చేసారు. నాదెండ్ల మనోహర్ వల్లే జనసేన పార్టీకి ప్రమాదం వుంది... ఈ విషయం మీకు అర్ధమయ్యిందా అనేలా అంబటి కామెంట్స్ చేసారు.
ఇక ఇటీవల పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపైనా మంత్రి అంబటి రాంబాబు రియాక్ట్ అయ్యారు. ''టీడీపీతో అలయన్స్ దశాబ్దకాలం కావాలంటావ్ ! మూడు ముళ్ళు మాత్రం మూడు రోజుల్లో తెంచేస్తావ్ !'' అంటూ అంబటి ఎద్దేవా చేసాడు. అలాగే తెలంగాణలో బిజెపితో, ఆంధ్ర ప్రదేశ్ లో టిడిపితో కలిసి జనసేన ఎన్నికలకు వెళ్లడంపైనా సెటైర్లు వేసారు. పవన్ కల్యాణ్ రాజకీయ నాయకుడి కంటే హీరోగానే సరిపోతాడని... నిర్మాతలకు కాల్ షీట్లు ఇచ్చినట్లు పార్టీలకు కూడా ఇస్తున్నాడని మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా చేసారు.