కర్నూలు టీడీపీలో వర్గపోరు: కోట్ల సుజాతమ్మకు అసమ్మతి సెగ

Published : Feb 13, 2019, 05:24 PM IST
కర్నూలు టీడీపీలో వర్గపోరు: కోట్ల సుజాతమ్మకు అసమ్మతి సెగ

సారాంశం

దీంతో ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీలో అసమ్మతి సెగ మెుదలైనట్లైంది. కోట్ల సుజాతమ్మకు ఆలూరు టికెట్‌ ఇస్తే సహించేది లేదని హెచ్చరిస్తున్నారు. ఆలూరు టికెట్‌ బీసీలకే కేటాయించాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు.   

కర్నూలు: మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మకు ఆలూరు నియోజకవర్గం నుంచి నిరసన సెగ వ్యక్తమవుతోంది. త్వరలో కేంద్ర మాజీమంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, సుజాతమ్మ దంపతులతోపాటు కొందరు కుటుంబ సభ్యులు సన్నిహితులు సైకిలెక్కనున్నారు. 

ఇప్పటికే చంద్రబాబు నాయుడుతో విందుభేటీలో పాల్గొన్న కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి దంపతులు పలు డిమాండ్ పెట్టినట్లు తెలుస్తోంది. సాగునీటి ప్రాజెక్టులు, అలాగే కర్నూలు ఎంపీ టికెట్ తోపాటు డోన్, ఆలూరు అసెంబ్లీ నియోజకవర్గాల టికెట్లు ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది. 

ఆలూరు నియోజకవర్గం నుంచి కోట్ల సుజాతమ్మ పోటీ చేస్తారని ప్రచారం జరుగుతుంది. ఈ ప్రచారం దావానంలా వ్యాపించడంతో ఆలూరు నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కోట్ల సుజాతమ్మ పోటీని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అంగీకరించడం లేదు. 

దీంతో ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీలో అసమ్మతి సెగ మెుదలైనట్లైంది. కోట్ల సుజాతమ్మకు ఆలూరు టికెట్‌ ఇస్తే సహించేది లేదని హెచ్చరిస్తున్నారు. ఆలూరు టికెట్‌ బీసీలకే కేటాయించాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. 

బీసీలకు కాకుండా వేరే సామాజిక వర్గానికి చెందిన వారికి కేటాయిస్తే సహించేది లేదని ఆలూరు మార్కెట్‌ యార్డ్‌ ఛైర్మన్‌ కురువ జయరాం, ఎంపీపీ పార్వతిలు స్పష్టం చేశారు. ఇకపోతే కర్నూలు జిల్లాలో డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి సైతం కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డిపై నిరసన గళం విప్పుతున్నారు. 

కోట్ల కుటుంబం తెలుగుదేశం పార్టీలో చేరడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. జిల్లాలో తెలుగుదేశం పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న తనకు కనీసం సమాచారం ఇవ్వకుండా నేరుగా చంద్రబాబుతో భేటీ కావడంపై కేఈ తోపాటు ఆయన అనుచరులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 

అంతేకాకుండా ఆలూరు, డోన్ టికెట్లు తమకేనంటూ కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి అనుచరులు ప్రచారం చేసుకోవడాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో బీసీవాదం తెరపైకి రావడం చూస్తుంటే భవిష్యత్ లో ఆలూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో వర్గపోరు మెుదలయ్యే ఛాన్స్ లేకపోలేదని తెలుస్తోంది. 

PREV
click me!

Recommended Stories

అమరావతిలో క్వాంటమ్ రిఫరెన్స్ ఫెసిలిటీ | CM Chandrababu Inaugurates Quantum Reference Facility
AP Food Commission Chitha Vijay Prathap:జగన్ మోహన్ రెడ్డి గారే ఇవన్నీ పెట్టారు | Asianet News Telugu