డప జిల్లా తెలుగుదేశం పార్టీలో విభేదాలు ముదిరి పాకాన పడుతున్నాయి. మంత్రి ఆదినారాయణ రెడ్డి తీరు మిగతా నాయకులకు మింగుడు పడడం లేదు.
కడప: కడప జిల్లా తెలుగుదేశం పార్టీలో విభేదాలు ముదిరి పాకాన పడుతున్నాయి. మంత్రి ఆదినారాయణ రెడ్డి తీరు మిగతా నాయకులకు మింగుడు పడడం లేదు. దాంతో ఆయనపై వీరశివారెడ్డి, రామసుబ్బారెడ్డి, తదితర నాయకులు ఎదురుదాడికి దిగారు.
ఆదినారాయణ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోవర్టుగా పనిచేస్తున్నారనే అనుమానాలు కలుగుతున్నాయని వీరశివారెడ్డి అన్నారు. ఆదినారాయణ రెడ్డి అన్న నారాయణ రెడ్డి, ఆయన కుమారుడు ఇప్పటికీ జగన్ తో టచ్ లో ఉన్నారని ఆయన అన్నారు.
ఆదినారాయణ రెడ్డి జమ్మలమడుగు తెలుగుదేశం పార్టీ టికెట్ దక్కకపోతే నారాయణ రెడ్డి గానీ ఆయన కుమారుడు గానీ వైఎస్సార్ కాంగ్రెసు టికెట్ తెచ్చుకునే అవకాశం ఉందని ఆయన అన్నారు. అందుకే ఆదినారాయణ రెడ్డిపై అనుమానాలు కలుగుతున్నాయని ఆయన అన్నారు. ఆది నారాయణ రెడ్డి రెచ్చగొట్టే ధోరణి కూడా ఆ అనుమానాలకు తావిస్తోందని అన్నారు.
జమ్మలమడుగు నుంచి తానే పోటీ చేస్తానని ఆదినారాయణ రెడ్డి చేసిన ప్రకటనపై ఆ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జీ రామసుబ్బారెడ్డి తీవ్రంగా ప్రతిస్పందించారు. తాను కూడా జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పనిచేశానని, జిల్లా అధ్యక్షులకు ఎన్నికల్లో అభ్యర్థులకు టికెట్లు ఇచ్చే అధికారం లేదని ఆయన అన్నారు. తాను మాట్లాడాల్సిన అవసరం వచ్చినప్పుడు మాట్లాడుతానని కూడా ఆయన అన్నారు.