
భారతీయ రైల్వేలో ఇటీవల చోటుచేసుకుంటున్న పరిణామాలు ప్రయాణికులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఇటీవల ఒడిశా ఘోర రైలు ప్రమాద ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి రైలు ప్రయాణికులు ఏ చిన్న ఘటన చోటుచేసుకున్న ఉలిక్కిపడుతున్నారు. తాజాగా బాపట్ల జిల్లా చీరాలలో సంఘమిత్ర ఎక్స్ప్రెస్ రైలు పెను ప్రమాదం తప్పింది. సంఘమిత్ర ఎక్స్ప్రెస్ ప్రయాణించాల్సిన మార్గంలో రైలు పట్టా విరిగి ఉన్నట్టుగా ముందుగా గుర్తించడంతో ఈ ప్రమాదం తప్పింది.
వివరాలు.. చీరాల మండలం ఈపురుపాలెం వంతెన వద్ద రైలు పట్టా విరిగింది. దీనిని గుర్తించిన గద్దె బాబు అనే వ్యక్తి వెంటనే రైల్వే అధికారులు సమాచారం అందించి.. అప్రమత్తం చేశాడు. దీంతో అప్రమత్తమైన రైల్వే అధికారులు.. అదే ట్రాక్పై వెళ్లాల్సిన దానాపూర్- బెంగుళూరు సంఘమిత్ర ఎక్స్ప్రెస్ రైలును నిలిపివేశారు. విరిగిన రైలు పట్టాకు రైల్వే అధికారులు మరమ్మతులు చేపట్టారు. ఆ ట్రాకులో పట్టాకు మరమ్మతు కారణంగా.. ఆ మార్గంలో రైళ్లను వేరే ట్రాక్పై నుంచి మళ్లించారు.
ఇక, రైలు పట్టాకు మరమ్మతుల అనంతరం రైళ్ల రాకపోకలను పునరుద్దరించారు. ఈ క్రమంలోనే ఆ మార్గంలోని పలు రైళ్లు అరగంటకు పైగా ఆలస్యంగా నడిచాయి.