
గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలోని ఉండవల్లి కృష్ణానది కరకట్టపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నివసిస్తున్న ఇంటి జప్తుకు సంబంధించి ఏసీబీ కోర్ట్ శుక్రవారం సంచలన ఆదేశాలు జారీ చేసింది. కరకట్ట నివాసం జప్తునకు ఏపీ సీఐడీకి అనుమతించింది. అలాగే లింగమనేని రమేష్తో పాటు ప్రతివాదులకు నోటీసులు ఇవ్వాలని సీఐడీని ఆదేశించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.
కాగా.. గత నెల 14న కరకట్టపై చంద్రబాబు నాయుడు గెస్ట్హౌస్ను ఏపీ ప్రభుత్వం అటాచ్ చేసింది. క్రిమినల్ లా అమెండమెంట్ 1994 చట్టం ప్రకారం అటాచ్ చేస్తున్నట్టుగా పేర్కొంది. చట్టాలు, కేంద్ర విజిలెన్స్ కమిషన్ మార్గదర్శకాలు, సాధారణ ఆర్థిక నియమాలు పూర్తిగా ఉల్లంఘించారని ఆరోపించింది. స్థానిక జడ్జికి సమాచారమిస్తూ కరకట్టపై చంద్రబాబు గెస్ట్హౌస్ను అటాచ్ చేసింది.
ALso Read: చంద్రబాబు నివాసం ఉంటున్న లింగమనేని గెస్ట్ హౌస్ జప్తు: తీర్పు రిజర్వ్ చేసిన కోర్టు
సీఆర్డీఏ మాస్టర్ ప్లాన్, ఇన్నర్ రింగ్ రోరడ్ అలైన్మెంట్లలో అవతవకలు జరిగాయనే ఆరోపణలకు సంబంధించి ఏపీ సీఐడీ విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు, నారాయణలు వారి పదవులను దుర్వినియోగం చేసినట్టుగా ఏపీ సీఐడీ చెబుతోంది. అధికారం ఉపయోగించుకుని బంధువులకు, స్నేహితులకు ప్రయోజనాలు కల్పించారని ఏపీ సీఐడీ అభియోగాలు మోపింది. వ్యాపారవేత్త లింగమనేనికి అనుకూలంగా వ్యవహరించినందుకు ప్రతిఫలంగా గెస్ట్హౌస్ తీసుకున్నారని ఆరోపించింది.