
Palamamidi: గిరిజన ప్రాంతంలో రోడ్లు లేకపోవడంతో వైద్య సౌకర్యాల విషయంలో అనేక మంది ప్రాణాలు కోల్పోవడం, వైద్యం కోసం చాలా కిలో మీటర్లు కాలినడకనే ప్రయాణం సాగిస్తున్న పరిస్థితిలు ఆంధ్రప్రదేశ్ లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో వెలుగుచూస్తూనే ఉన్నాయి. ఇదే క్రమంలో గర్భిణులు దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నారనే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. రోడ్డు మార్గలు లేకపోవడంతో కాలినడకన ఆస్పత్రిలో వెళ్తుండగా, ఒక మహిళ మార్గమధ్యలోనే ప్రసవించింది. ఆపై మూడు కిలో మీటర్లు కాలినడక తర్వాత రోడ్డు మార్గానికి చేరుకోవాల్సిన దుస్థితి అల్లూరి సీతారామరాజు జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ప్రాంతంలో ఇలాంటి ఘటనలు అనేకం వెలుగులోకి వస్తున్న ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని ఇక్కడి ప్రజలు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.
వివరాల్లోకెళ్తే.. ఒక మహిళ ప్రసవించిన తర్వాత సమీప రోడ్డు పాయింట్ కు చేరుకోవడానికి మూడు కిలోమీటర్లు నడవాల్సి వచ్చింది. సమీపంలోని ఆస్పత్రికి తరలిస్తుండగా దట్టమైన అటవీ ప్రాంతంలో మార్గమధ్యలోనే మహిళ మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే, ఆమె ప్రసవం తర్వాత కూడా మూడు కిలో మీటర్లు నడిచి రోడ్డు మార్గానికి చేరుకుంది. అంబులెన్స్ రాకముందే ఆమె మూడు కిలోమీటర్లు నడవాల్సి వచ్చింది. చింతపల్లి మండలం అంజలి సానివరం పంచాయతీ పాలమామిడి గ్రామానికి చెందిన సిదారి దేవిని గ్రామానికి 27 కిలోమీటర్ల దూరంలోని చింతపల్లి ఆసుపత్రికి తరలించారు. ఆమె డెలివరీ తేదీ మార్చి 17న జరగాల్సి ఉంది. తల్లీబిడ్డలను కాపాడేందుకు కొత్త జిల్లా వైద్య సిబ్బంది ప్రసవ తేదీకి 10 రోజుల ముందే గర్భిణులను ప్రసవ కేంద్రాలకు తరలిస్తున్నారు.
దేవి కుటుంబ సభ్యులు ఆమెను మోటారు సైకిల్ పై తమ గ్రామానికి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామపంచాయతీ రోడ్డు పాయింట్ వైపు శనివారం తీసుకెళ్లారు. అయితే, పాలమామిడి నుంచి 4 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత దేవికి పురిటి నొప్పులు రావడంతో పాలమ్మ అనే ఆశావర్కర్ సాయంతో మగబిడ్డకు జన్మనిచ్చింది. దేవి తదుపరి వైద్య సహాయం పొందే ఆసుపత్రి, గ్రామానికి సుమారు 27 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రసవం తర్వాత దేవి మూడు కిలోమీటర్లకు పైగా నడిచి మాడెంబండలోని రోడ్ పాయింట్ చేరుకోవాల్సి వచ్చింది. అక్కడ వైద్య సిబ్బంది రోగి సౌలభ్యం కోసం ఒక వాహనాన్ని ఉంచారు. మహిళను అంబులెన్స్ లో తాజంగి ఆసుపత్రికి తరలించగా తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు.
పాలమామిడి గ్రామంలో రెండు వైద్య శిబిరాలు నిర్వహించామని, రోడ్డు సౌకర్యం లేని గ్రామానికి చేరుకునే సమయంలో ఇబ్బందులు ఎదుర్కొన్నామని వైద్యులు పేర్కొంటున్నారు. ఈ నెల 17న దేవి, మరో గర్భిణి ప్రసవం తేదీ కావడంతో గురువారం తాజంగి నుంచి చింతపల్లిలోని బర్త్ వెయిటింగ్ సెంటర్ కు తరలించాలని తమ సిబ్బంది భావించారని వైద్యులు తెలిపారు. కుటుంబ సభ్యులు వైద్య సిబ్బందికి సమాచారం అందించగా వారు ముందుగానే అడ్మిట్ చేసుకోవాలని భావించి చర్యలు తీసుకున్నారు. దానికి అనుగుణంగా రోడ్డు పాయింట్ వద్ద ఒక వాహనాన్ని ఉంచామని తెలిపారు. అయితే, మార్గమధ్యంలోనే మహిళ మగబిడ్డకు జన్మనిచ్చిందని తాజంగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు తెలిపారు.
కాగా, పాలమామిడి గ్రామంలో కొండ్ సామాజిక వర్గానికి చెందిన 30 కుటుంబాలకు చెందిన 150 మంది జనాభా ఉన్నారు. రోడ్డు సదుపాయం లేకపోవడంతో గతంలో అనేక మంది గ్రామస్థులు ఇబ్బందులు పడగా, స్థానికులు మోటారు సైకిళ్ల కోసం కచ్చా రోడ్డును ఏర్పాటు చేసుకున్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా తమ గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాలను కలుపుతూ రోడ్డు నిర్మించాలని గిరిజన సంఘం నాయకుడు కొర్రా ప్రసాద్ జిల్లా అధికారులను కోరారు. చాలా కాలం నుంచి ఇలాంటి ఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి కానీ ఇక్కడ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని గిరిజనులు పేర్కొంటున్నారు.