ఏపీలో ఆగని కరోనా వ్యాప్తి: 5,636కు చేరుకున్న పాజిటివ్ కేసులు, 80 మరణాలు

By telugu teamFirst Published Jun 12, 2020, 1:29 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ చాప కింద నీరులా విస్తరిస్తూనే ఉంది. తాజాగా గత 24 గంటల్లో 207 మందికి కరోనా వైరస్ పాజిటివ్ నిర్దారణ అయింది. ఇందులో ఇతర రాష్ట్రాలకు చెందిన కేసులు 64 ఉన్నాయి.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి ఆగడం లేదు. చాప కింద నీరులా వ్యాపిస్తూనే ఉంది. తాజాగా గత 24 గంటల్లో ఏపీలో 207 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో ఏపీ స్థానికులకు చెందిన కేసులు 141 కాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారిలో 64 మందికి కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ అయింది. విదేశాల నుంచి వచ్చినవారిలో ఇద్దరికి కరోనా వైరస్ సోకినట్లు తేలింది. 

ఏపీలో మొత్తం కోవిడ్ -19 పాజిటివ్ కేసుల సంఖ్య 5,636కు చేరుకుంది. తాజాగా రాష్ట్రంలో మరణాలేవీ సంభవించలేదు. ఇప్పటి వరకు ఏపీలో 80 మంది కరోనా వైరస్ కారణంగా మృత్యువాత పడ్డారు. 

ఏపీలో గత 24 గంటల్లో 11,775 శాంపిల్స్ ను పరీక్షించగా 141 మందికి కోవిడ్ 19 పాజిటివ్ ఉందని తేలిందని ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్ లో తెలిపింది. గత 24 గంటల్లో 59 మంది కరోనా వైరస్ వ్యాధి నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జీ అయినట్లు తెలిపింది. 

రాష్ట్రంలో నమోదైన మొత్తం 4402 పాజిటివ్ కేసులకు గాను 2599 మంది డిశ్చార్జీ కాగా, 80 మంది మరణించారు. ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాధికి 1723 మంది చికిత్స పొందుతున్నారు. 

విదేశాల నుంచి వచ్చినవారిలో 199 మందికి కరోనా వైరస్ పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. అందులో 178 మంది యాక్టివ్ కేసులు ఉన్నాయి.  కాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారిలో 1035 మందికి కరోనా వైరస్ ఉన్నట్లు తేలింది. గత 24 గంటల్లో 64 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జీ అయ్యారు. యాక్టివ్ కేసులు 564 ఉన్నాయి.

click me!