కరోనా వైరస్: రాణిగారి తోటలో టిఫిన్ బండి వ్యాపారికి పాజిటివ్

By telugu teamFirst Published Apr 14, 2020, 11:52 AM IST
Highlights
విజయవాడలోని రాణిగారి తోటలో ఓ వ్యాపారికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో ఆ ప్రాంతంలో ఇద్దరు వ్యాపారులకు కరోనా సోకినట్లయింది. పానీపూరి వ్యాపారి నుంచి అది సోకినట్లు చెబుతున్నారు.
విజయవాడ: విజయవాడలోని రాణిగారి తోటలో ఇద్దరు వ్యాపారులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. టిఫిన్ బండి వ్యాపారికి కరోనా సోకినట్లు నిర్ధారించారు. కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యే వరకు అతను వ్యాపారం చేశాడు. రాణిగారి తోటను ఇప్పటికే రెడ్ జోన్ గా ప్రకటించారు. ఓ పానీపూరి వ్యాపారి నుంచి అతనికి కరోనా సోకినట్లు అనుమానిస్తున్నారు.  

పానీపూరి వ్యాపారి ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో జరిగిన మర్కజ్ కు వెళ్లివచ్చాడు. అంతేకాకుండా కాళహస్తిలో జరిగిన మత సమ్మేళనంలో కూడా పాల్గొని వచ్చాడు. అతనికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు గతంలోనే గుర్తించారు.

కరోనా వైరస్ బారిన పడి ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లాకు చెందిన ఆర్థోపెడిక్ సర్జన్ చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో మరణించాడు. సోమవారం తెల్లవారు జామున అతను మరణింటాడు. తమిళనాడులో సోమవారం సాయంత్రానికి కొత్తగా 98 కేసులు నమోదయ్యాయి. కరోనా వైరస్ సోకినవారిలో ముగ్గురు డాక్టర్లు కూడా ఉన్నారు.

తమిళనాడులో 1,173 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 11 మంది మృత్యువాత పడ్డారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన డాక్టర్ కు నెల్లూరులో కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది. అతన్ని ఏప్రిల్ 5వ తేదీన చెన్నై తీసుకుని వచ్చారు. అతని మరణాన్ని ఆంధ్రప్రదేశ్ జాబితాలో చేరుస్తామని అధికారులు చెప్పారు. 

డాక్టర్ మృతదేహానికి అంత్యక్రియలు చేయడం ఇబ్బందిగా మారింది. స్మశానవాటిక సమీపంలోని ప్రజలు అతని అంత్యక్రియలను వ్యతిరేకించారు. అది తమకు ప్రాణాంతకంగా పరిణమించే ప్రమాదం ఉందని వారు అభ్యంతరం చెప్పారు. 

డాక్టర్లకు కూడా కరోనా వైరస్ సోకుతుండడడంతో తమిళనాడు ఆరోగ్య శాఖపై ఒత్తిడి పెరిగింది. కోయంబత్తూర్ వైద్య కళాశాల వైద్య విద్యార్థికి, ఈఎస్ఐసీ ఆస్పత్రిలో విధులు నిర్వహించిన మరో వైద్య విద్యార్థికి కరోనా వైరస్ సోకింది. ఇప్పటి వరకు 11 మంది వైద్యులకు కరోనా పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారణ అయిందని ఆరోగ్య శాఖ కార్యదర్శి బీలా రాజేశ్ చెప్పారు.
click me!