దృష్టి మరల్చడానికే చంద్రబాబు హంగామా... విజయవాడ ఘటన ఆయన స్క్రిప్టే: హోంమంత్రి సుచరిత

By Arun Kumar PFirst Published Jan 8, 2020, 10:25 PM IST
Highlights

కొద్దిసేపటి క్రితం విజయవాడలో జరిగిన ఉద్రిక్తత, టిడిపి అధ్యక్షులు చంద్రబాబు  అరెస్ట్ పై హోంమంత్రి మేకతోటి సుచరిత స్పందించారు. 

అమరావతి: టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఓ అసాంఘిక శక్తి... హింస లేనిదే బతకలేడని ఏపి హోంమంత్రి మేకతోటి సుచరిత  ఘాటు విమర్శలు చేశారు. అధికారం కోల్పోయిన తర్వాత ఆయన పరిస్థితి ఒడ్డున పడ్డ చేపలా తయారైందన్నారు. విజయవాడ, గుంటూరులో శాంతి భద్రతల సమస్య సృష్టించి తన బినామీ భూముల రేట్లు తగ్గకుండా కాపాడుకునేందుకు ఆయన ఎంతకయినా తెగించడానికి సిద్దంగా వున్నారన్నారు.

 నిజానికి రాష్ట్రంలో మూడు రాజధానులు ఉండే అవకాశం ఉందన్న ప్రతిపాదనల్లో విజయవాడ తన ప్రాధాన్యతను ఎప్పటికీ నిలబెట్టుకునేలా లెజిస్లేటివ్‌ రాజధాని ఇక్కడే ఉంటుందని అందరికీ అర్థం అయ్యిందన్నారు. అభివృద్ధిని అందరికీ పంచకపోతే తిరుగుబాటు లేదా ఉద్యమాలు వస్తాయని శ్రీకృష్ణ కమిటీ, శివరామకృష్ణన్‌ కమిటీ స్పష్టంచేశాయని ఆమె గుర్తుచేశారు.

గతంలో చంద్రబాబు చేసిన దుర్మార్గాన్ని సరిదిద్దేందుకు ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. ఏ ప్రాంతానికీ అన్యాయం చేసే ఆలోచన తమకు లేదని... రైతులకు అన్యాయం చేసే ఆలోచన అంతకన్నా లేదన్నారు. అయినా చంద్రబాబు ఉద్దేశ పూర్వకంగానే శాంతి భద్రతల సమస్యను సృష్టించి తన పార్టీని బతికించుకోవాలనుకుంటున్నారని హోమంత్రి ఆరోపించారు. ఇందుకోసం శవరాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.

బుధవారం బెంజ్‌ సర్కిల్‌ వద్ద పక్కా పథకంతో ముందుగానే తన మనుషులను పిలిపించుకుని లా అండ్‌ ఆర్డర్‌ సమస్యను ఉద్దేశ పూర్వంగా సృష్టించాడని అన్నారు. ముందుగానే తన అనుకూల మీడియాను పిలిపించుకుని ఒక డ్రామా నడిపాడన్నారు. విజయవాడలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే అక్కడి ప్రజలకు మేలు జరుగుతుందా? అని ఆమె ప్రశ్నించారు.

Video: చంద్రబాబు అరెస్టు... అట్టుడుకుతున్న అమరావతి

 విజయవాడలో శాంతి భద్రతలు ఇలా ఉన్నాయంటే రాష్ట్రంలో మిగతా ప్రాంతాల వారికి ఎలాంటి సంకేతం పోతుంది? సచివాలయానికి, అసెంబ్లీకి, హైకోర్టుకు వెళ్లే దారిని వెళ్లకుండా రోడ్డుమీద కూర్చుని అడ్డగిస్తున్నారంటే.. 13 జిల్లాల్లోని ప్రజలకు ఏం అర్థం అవుతుందని ఆమె నిలదీశారు. చంద్రబాబు ముఠా సామ్రాజ్యంగా ఈప్రాంతాన్ని నడిపేందుకే ఈ ఉద్యమం చేస్తున్నాడని ఇప్పటికే అందరికి అర్థం అయ్యిందన్నారు.

పోలీసుల సహనాన్ని ఎంత పరీక్షించినా.. వారు మౌనంగానే ఉండి ప్రశాంతగా విధులు నిర్వర్తించారన్నారు. చంద్రబాబు రెచ్చగొట్టినా ప్రజలెవ్వరూ రెచ్చిపోలేదు, రెచ్చపోరుకూడా అని అన్నారు. మంగళవారం తమ పార్టీ ఎమ్మెల్యేలు ఇద్దరి మీద హత్యాయత్నం చేసినా  ప్రభుత్వం సంయమనం పాటించిందన్నారు. ఇదంతా చంద్రబాబు తన చేతకాని తనంతో చేస్తున్నాడని కనపడుతోందన్నారు. ప్రజా బలం లేని చంద్రబాబును చూసి రాష్ట్రం అంతా చీకొడుతోందన్నారు.

40 ఏళ్ల రాజకీయ అనుభవం, 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన అనుభవం, మూడు సార్లు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న అనుభవం.. పక్కకుపోయి చంద్రబాబు నిజస్వరూపం ఒక అసాంఘిశక్తి రూపంలో, హింసావాది రూపంలో బట్టబయలు అయ్యిందన్నారు. తనను జాతీయ నాయకుడిగా ప్రచారం చేసుకున్న చంద్రబాబు తాను ఒక ముఠానాయకుడినేనని నిరూపించుకున్నాడన్నారు.

 

భారతదేశ చరిత్రలోనే 29 రాష్ట్రాల్లో ఏనాడూ కనీవినీ ఎరుగని ఒక అద్భుతమైన పథకం అమ్మ ఒడి రూపంలో ఒక చారిత్రక ఘట్టానికి ఆంధ్రప్రదేశ్‌ వేదిక కాబోతుందన్న అంశాన్ని డైవర్ట్‌ చేయడానికి చంద్రబాబు ఇంతకు తెగించాడని ఆరోపించారు.  తన పాదయాత్ర ముగిసిన జనవరి 9 నే దాదాపు 43 లక్షల మందికి తల్లులకు, వారి పిల్లల్ని చదవించుకునేందుకు వీలుగా రూ.6400 కోట్లకుపైగా డబ్బును వారి ఖాతాల్లో వేయబోతున్న ఇంత పెద్ద సందర్భాన్ని చంద్రబాబు డైవర్ట్‌ చేయడానికి రోడ్డుమీద కూర్చున్నాడని.... తన పచ్చమీడియాను పురిగొల్పుతున్నాడని హోమంత్రి సుచరిత ఆరోపించారు. 

click me!