దేశవ్యాప్తంగా బోలెడు రైల్వేస్టేషన్లు ఉన్నాయి. మరి వాటిలో అతి పెద్ద పేరున్న రైల్వేస్టేషన్ ఏంటో మీకు తెలుసా? అది ఎక్కడుందో చెప్పగలరా?
ప్రపంచంలోని అతిపెద్ద రైల్వే నెట్వర్క్లలో ఇండియన్ రైల్వే ఒకటి. రోజూ 19 వేలకు పైగా రైళ్లు నడుస్తున్నాయి. ఏటా 421 బిలియన్ల మంది రైళ్లలో ప్రయాణిస్తున్నారు. అనేక ప్రత్యేకతలు కలిగిన భారతీయ రైల్వేలో అతి పెద్ద పేరు కలిగిన రైల్వే స్టేషన్ ఉంది. అది ఏంటో? ఎక్కడుందో మీకు తెలుసా?
దేశవ్యాప్తంగా 7 వేలకు పైగా రైల్వే స్టేషన్లు ఉన్నాయి. వీటిలో చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ దేశంలోనే అతి పొడవైన పేరు కలిగిన రైల్వే స్టేషన్గా గుర్తింపు పొందింది. చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ పూర్తి పేరు.. పురచ్చి తలైవర్ డాక్టర్ ఎంజీ రామచంద్రన్ సెంట్రల్ రైల్వే స్టేషన్. అయితే ఈ పేరు ఇటీవలే పెట్టారు. ఈ స్టేషన్ అసలు పేరు మద్రాస్ సెంట్రల్ రైల్వే స్టేషన్.
బ్రిటిష్ కాలంలో ఈ స్టేషన్కు మద్రాస్ సెంట్రల్ అని పేరు పెట్టగా, తర్వాత చెన్నై సెంట్రల్గా మార్చారు. 2019లో మళ్ళీ, పురచ్చి తలైవర్ డాక్టర్ ఎంజీ రామచంద్రన్ సెంట్రల్ రైల్వే స్టేషన్ గా పేరు మార్చారు. తమిళనాడు ప్రభుత్వం ఈ పేరును కేంద్రానికి సిఫారసు చేయగా.. కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. మాజీ ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్కు గౌరవసూచకంగా ఈ పేరు పెట్టారు.
పెద్ద పేరు కలిగిన రెండవ రైల్వే స్టేషన్ గా.. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో ఉన్న విఎన్ రాజువారిపేట స్టేషన్ ఉంది. ఈ స్టేషన్ పూర్తి పేరు వెంకట నరసింహ రాజువారిపేట రైల్వే స్టేషన్. 2019 కంటే ముందు ఈ విఎన్ రాజువారిపేట స్టేషన్.. దేశంలోనే అతి పొడవైన పేరు గల రైల్వే స్టేషన్గా గుర్తింపు పొందింది. కానీ 2019లో చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ పేరు మార్చడంతో విఎన్ రాజువారిపేట రెండవ స్థానానికి పడిపోయింది.