తిరుమల వెంకన్న భక్తులకు తీపికబురు... కీలక నిర్ణయం దిశగా టిటిడి

By Arun Kumar PFirst Published Jan 1, 2020, 5:48 PM IST
Highlights

ప్రత్యక్షదైవం తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు టిటిడి ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి  తీపికబురు అందించారు.  

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రం సుభిక్షంగా కలకాలం కొనసాగాలని నూతన సంవత్సరాది రోజున తిరుమల వెంకటేశ్వరస్వామి కోరుకున్నట్లు టీటీడీ ఛైర్మెన్ వై వి సుబ్బారెడ్డి తెలిపారు. సకాలంలో వర్షాలు పడి ఏపి ప్రజలే కాదు యావత్ దేశ ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆ దేవదేవున్ని వేడుకున్నట్లు తెలిపారు. 

తిరుమలలో సామాన్య భక్తులకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు... ప్రతి ఒక్కరికీ త్వరితగతిన స్వామివారి దర్శన భాగ్యం కలిగేలా చర్యలు చేపట్టామన్నారు. తిరుమలకు వచ్చే ప్రతీ భక్తుడికీ స్వామివారి లడ్డూ ప్రసాదం ఉచితంగా అందించబోతున్నామని... అందుకోసం విధివిధాలను రూపొందిస్తున్నట్లు తెలిపారు.

సంక్షేమ పథకాలతో సీఎం జగన్ కు వస్తున్న జనాదరణను చూసి టీడీపీ ఓర్వలేకపోతోందన్నారు. రైతుల పేరుతో రాజధాని డ్రామా ఆడుతోందన్నారు. అమరావతిలో బినామీ పేర్లతో కొన్న భూములకు విలువ పడిపోతుందన్న భయంతో ఈ కుట్ర రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. 

రాష్ట్రాన్ని రెండులక్షల కోట్ల అప్పులోకి నెట్టిన ఘనుడు చంద్రబాబు నాయుడని విమర్శించారు. టీడీపీ భూముల కోసం  అమరావతిని లక్షకోట్లు పెట్టి అభివృద్ధి చేయాలా .? అని ప్రశ్నించారు.

అన్నిప్రాంతాలు అభివృద్ధి చెందాలని సీఎం భావిస్తుంటే ఒక్క ప్రాంతానికే పరిమితం చేయాలని టిడిపి ప్రయత్నిస్తోందన్నారు. రాష్ట్రంలో రైతు సంక్షేమానికి సీఎం జగన్ పెద్దపీట వేశారని... రాజధాని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఖచ్చితంగా న్యాయం చేస్తామని....అయితే కమిటీ నివేదిక ఓపిక పట్టాలన్నారు. ఆ తర్వాత అందరికీ న్యాయం జరిగేలా నిర్ణయం ఉంటుందని సుబ్బారెడ్డి వెల్లడించారు. 

click me!