ఏపీలో పెట్టుబడులు పెట్టాలని ఎన్ఆర్ఐలను కోరిన వైవీ సుబ్బారెడ్డి

By narsimha lodeFirst Published Oct 13, 2019, 5:51 PM IST
Highlights

రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఎన్ఆర్ఐలను టీటీడీ ఛైర్మెన్ వైవీ సుబ్బారెడ్డి కోరారు.


తిరుపతి: ఇక్కడగానీ.. మీ ఊళ్లలో గానీ ఏ సమస్య ఉన్నా చెప్పండి. సీఎం జగన్‌ మోహన్‌రెడ్డిగారితో మాట్లాడి పరిష్కరిస్తానని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి భరోసానిచ్చారు. సింగపూర్‌లో శ్రీనివాస కల్యాణానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన అక్కడి ఎన్‌ఆర్‌ఐలతో ఆదివారం సమావేశమయ్యారు. 

ఈసందర్భంగా వాళ్లు వెలిబుచ్చిన అంశాలపై  ఆయన మాట్లాడారు. నేడు రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్‌ మోఎహన్‌రెడ్డి చేపడుతున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. మౌలిక సదుపాయాలు, నేరుగా ప్రజలకే నిధులు కేటాయించే విధంగా పాలనలో తీసుకొచ్చిన సంస్కరణల గురించి సుబ్బారెడ్డి వెల్లడించారు. 

ఎన్‌ఆర్‌ఐలు పది మందికి ఉద్యోగాలిచ్చే ప్రాజెక్టులతో ఇండియాకు వస్తే సంతోషిస్తామన్నారు. పెట్టుబడులకు ఎలాంటి ఢోకా లేదని చెప్పారు. ఇతర దేశాలకు వెళ్లి ఉద్యోగాలు చేయాలనే  ఆలోచన నుంచి మన రాష్ట్రంలోనే ఉద్యోగాలు కల్పించే యూనిట్లు నెలకొల్పే విధంగా ఆలోచించాలని ప్రవాస భారతీయులను వైవీ సుబ్బారెడ్డి కోరారు. 

నేడు సీఎం చేపట్టిన గ్రామ సచివాలయాల వ్యవస్థ ప్రజల కొనుగోలు శక్తిని పెంచడానికి దోహదపడుతుందన్నారు. ఆర్థిక మాంద్యంలో సైతం రాష్ట్రం వెనుకబడకుండా తగు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు.

 మీ మేథస్సు మీ సొంతూళ్లకు ఉపయోగపడే విధంగా రూపొందించుకుంటే.. అందుకు తన వంతు సహకారమందిస్తానని సుబ్డారెడ్డి స్పష్టం చేశారు. మీ సొంత నియోజకవర్గాల్లో ఏవైనా సమస్యలుంటే పరిష్కరిస్తానని హామీనిచ్చారు. ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నా మన సంప్రదాయాలు, సంస్కృతిని నిలబెడుతున్న ప్రవాస తెలుగు ప్రజలందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. 

సమావేశంలో ఎస్‌ఆర్‌సీపీ ఎన్‌ఆర్‌ఐ విభాగం అధ్యక్షుడు బొమ్మ శ్రీనివాసరెడ్డి, కన్వీనర్‌ డి. ప్రకాష్‌రెడ్డి, సభ్యులు మహేష్‌ రెడ్డి, వేణుగోపాలరెడ్డి, సత్య, నాగరాజు, సంతోష్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, వీరారెడ్డి పాల్గొన్నారు.


 

click me!