వొడాఫోన్-ఐడియా మూతపడనుందా? వాటి వినియోగదారులకు షాకేనా!

By Rekulapally SaichandFirst Published Dec 8, 2019, 12:32 PM IST
Highlights

వొడాఫోన్‌ ఐడియా భవితవ్యంపై ఆ సంస్థ చైర్మన్ కుమార మంగళం బిర్లా సంచలన వ్యాఖ్యలు చేశారు. సర్కార్ సాయపడకపోతే సంస్థ భవిష్యత్ ప్రశ్నార్థకమేనని స్పష్టం చేశారు.

న్యూఢిల్లీ: దేశంలోని అతిపెద్ద టెలికం కంపెనీల్లో అగ్రగామిలో ఒక్కటైన ఉన్న వొడాఫోన్‌ ఐడియా లిమిటెడ్‌ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. వొడాఫోన్ ఐడియా గ్రూప్ చైర్మన్, ఆదిత్య బిర్లా గ్రూప్‌ చైర్మన్‌ కుమారమంగళం బిర్లా ఆందోళన వ్యక్తం చేశారు. తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న వొడాఫోన్‌ ఐడియాకు ప్రభుత్వం ఊరట కల్పించకపోతే సంస్థను మూసేయక తప్పదని స్పష్టం చేశారు. 
హిందుస్థాన్‌ టైమ్స్‌ లీడర్‌షిప్‌ సమ్మిట్‌-2019లో కుమార మంగళం బిర్లా సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వానికి రూ.53,038 కోట్ల పాతబకాయిలు చెల్లించాల్సి ఉన్న వొడాఫోన్‌ ఐడియాకు ఉపశమనం లభించకపోతే సంస్థ భవితవ్యం ఏమిటన్న ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ.. సర్కార్ నుంచి తమకు ఎలాంటి చేయూత లభించకపోతే వొడాఫోన్‌ ఐడియా కథ ముగిసిట్టే భావిస్తానని చెప్పారు. 

వాట్సాప్ కొత్త ఫీచర్‌...వీడియో కాల్ మాట్లాడుతున్నపుడు....

వినియోగదారులకు ఉచితంగా వాయిస్‌కాల్స్‌తోపాటు అతితక్కువ ధరకు డాటాను అందుబాటులోకి తేవడం ద్వారా ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేశ్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ జియో దేశీయ టెలికం మార్కెట్‌లో మొదలుపెట్టిన ‘యుద్ధాన్ని’ తట్టుకునేందుకు బిర్లా నేతృత్వంలోని ఐడియా సెల్యులార్‌ సంస్థ గతేడాది వొడాఫోన్‌ ఇండియా పబ్లిక్‌ లిమిటెడ్‌ కంపెనీలో విలీనమై వొడాఫోన్‌ ఐడియా లిమిటెడ్‌గా ఏర్పడిన విషయం తెలిసిందే.

వొడాఫోన్, ఐడియాలతో విలీనమైన ఈ విలీన సంస్థ రుణభారం రూ.1.17 లక్షలకోట్లకు పెరిగింది. దీనికితోడు దేశంలోని టెలికం సంస్థల నుంచి పాత బకాయిలను వసూలు చేయాలన్న ప్రభుత్వ వాదనను సమర్థిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం వొడాఫోన్‌ ఐడియా లిమిటెడ్‌కు శరాఘాతమైంది.

ఈ తీర్పుతో కంపెనీతోపాటు భారతీ ఎయిర్‌టెల్‌, ఇతర టెలికం సంస్థలు గత 14 ఏళ్ల లైసెన్సు ఫీజు, స్పెక్ట్రమ్‌ వినిమయ చార్జీలు, వాటిపై వడ్డీ, జరిమానా కలిపి ప్రభుత్వానికి దాదాపు రూ.1.47 లక్షలకోట్ల పాతబకాయిలు చెల్లించాల్సిన పరిస్థితి  ఏర్పడింది. దీన్ని అధిగమించేందుకు వడ్డీని, జరిమానా రద్దుచేయడం ద్వారా తమ బకాయిలను సగానికి తగ్గించాలని ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా ప్రభుత్వానికి విన్నవించుకున్నాయి. 

బకాయిల తగ్గింపు విషయమైభారతీ ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా సంస్థలు సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్‌  దాఖలుచేశాయి. ఈ నేపథ్యంలో కేవలం టెలికం రంగానికే కాకుండా ఆరేళ్ల కనిష్ఠ వృద్ధిరేటుతో సతమతమవుతున్న దేశీయ పారిశ్రామిక రంగం మొత్తానికి ప్రభుత్వం ఉపశమనం కల్పిస్తుందని ఆశిస్తున్నట్టు కుమారమంగళం బిర్లా తెలిపారు. 

టెలికం రంగం ఎంతో కీలకమైనదన్న వాస్తవం ప్రభుత్వానికి బోధపడిందని, కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన డిజిటల్‌ ఇండియా కార్యక్రమం మొత్తం టెలికం రంగంపైనే ఆధారపడి ఉన్నదని కుమార మంగళం బిర్లా పేర్కొంటూ.. ప్రభుత్వం నుంచి తాము మరిన్ని ఉద్దీపనలను ఆశిస్తున్నట్టు చెప్పారు.

ఆరేండ్ల కనిష్ఠ స్థాయికి పడిపోయిన వృద్ధికి మళ్లీ ఊతమివ్వాలంటే కేంద్రం కచ్చితంగా భారీ ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని కుమార మంగళం బిర్లా అన్నారు. ఇదివరకే ప్రకటించిన కార్పొరేట్‌ ట్యాక్స్‌ తగ్గింపు కంటే పెద్దగా ఉండాలని సూచించారు. ఆర్థిక చర్యలు వ్యాపార రంగంపై సానుకూల ప్రభావం చూపుతున్నా..ఆర్థిక పాలసీలు కచ్చితంగా అవసరమవుతాయని, ముఖ్యంగా పడిపోయిన వృద్ధి తిరిగి కోలుకోవాలంటే ఇవి అవసరమని ఆయన అన్నారు. 

ఆర్థిక రంగం ఏ దిశలో ప్రయాణిస్తుందో తెలుసునని, కార్పొరేట్‌ సంస్థలు ఏ సమయంలోనైనా పుంజుకునే అవకాశం ఉన్నదని కుమార మంగళం బిర్లా చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిభారత్‌ 5 శాతం మాత్రమే వృద్ధిని నమోదు చేసుకోనున్నదని రిజర్వు బ్యాంక్‌ అంచనావేసిన మరునాడే బిర్లా ఈ వ్యాఖ్యలు చేయడం మరింత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

పన్నులను తగ్గించడం ప్రతిసారి స్వాగతిస్తాం..మరింత తగ్గించాలని కోరుకుంటాం..ఇదే సమయంలో నగదు లభ్యత పెంచేందుకు చర్యలు తీసుకోవడంతోపాటు భారీ ఉద్దీపన ప్యాకేజీ ప్రకటిస్తేనే అన్ని రంగాలకు లబ్దిచేకూరనున్నదని కుమార మంగళం బిర్లా పేర్కొన్నారు.

ఆపిల్ క్లిప్స్ యాప్ లో కొత్త ఫిచర్

తమ బకాయిల చెల్లింపులకు, వ్యాపార విస్తరణకోసం ప్యాకేజీలు ప్రకటించాలని పలు కార్పొరేట్‌ సంస్థలు కోరుతున్నాయని కుమార మంగళం బిర్లా అన్నారు. వీటి వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని, ఆదాయ పన్ను తగ్గించడం వల్ల వినియోగదారులు పెట్టే ఖర్చు పెరుగనుండటం ఇది ఆర్థిక వ్యవస్థకు లాభం చేకూరుతున్నదని పేర్కొన్నారు. ఇదే క్రమంలో జీఎస్టీని 15 శాతానికి తగ్గించడంతో ఇది అతిపెద్ద ఉద్దీపన ప్యాకేజిలాంటిదని వ్యాఖ్యానించారు. వీటితోపాటు మౌలిక రంగం కోసం కేంద్ర ప్రభుత్వం భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టాలని ఆదిత్య బిర్లా గ్రూపు చైర్మన్‌ సూచించారు.

click me!