
హైదరాబాద్ : తెలంగాణలో ఎవరైనా సంపాదించుకున్నారంటే అది సీఎం కేసీఆర్ కుటుంబమేనని వైఎస్సార్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల పేర్కొన్నారు. ప్రాజెక్టుల పేరుతో భారీగా సంపాదించుకున్నారన్నారు. నీళ్లు కేసీఆర్ ఇంటికి, నియామకాలు ప్రగతి భవన్ కి, నిధులు ఆయన కుటుంబానికి అని షర్మిల ఎద్దేవా చేశారు.
ఉద్యోగులు భయంతో బతుకుతున్నారన్నారు. ఉద్యోగం ఇవ్వని చేతకాని సీఎంకి తీసే హక్కు ఎకడిదని ప్రశ్నించారు. దొర దగ్గరకు పోవాలంటే మంత్రులకు, ఎమ్మెల్యేలకు కూడా అవకాశం లేదన్నారు. సీఎం కేసీార్ మహిళలను కుక్కలతో పోలుస్తున్నారు. మీరు ప్రజలకు సేవకులు, ప్రవ్నిస్తే ఎందుకు అసహనమని షర్మిల ప్రశ్నించారు.
కాగా, వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలోని ఇల్లంతకుంట మండలంలో మంగళవారం నిరుద్యోగ నిరాహార దీక్ష చేపట్టారు. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ ఎంతకూ ఉద్యోగ నోటిఫికేషన్లు రాకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురయిన నిరుద్యోగి మహ్మద్ షబ్బీర్(26) రైలుకింద ఆత్మహత్య చేసుకున్నాడు.
ఇలా పుట్టెడు దు:ఖంలో వున్న షబ్బీర్ కుటుంబాన్ని షర్మిల పరామర్శించారు. సిరిసేడు గ్రామానికి చేరుకున్న షర్మిల నేరుగా షబ్బీర్ ఇంటికి వెళ్ళి కుటుంబసభ్యులను పరామర్శించారు. షబ్బీర్ చిత్ర పటం వద్ద పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. అనంతరం షర్మిల గ్రామంలో ఏర్పాటుచేసిన నిరుద్యోగ నిరాహార దీక్షాస్థలికి చేరుకున్నారు. ఇలా దీక్షకు కూర్చున్న షర్మిల ఇవాళ సాయంత్రం వరకు ఎలాంటి ఆహారం తీసుకోకుండా అక్కడే వుంటారు. సాయంత్రం దీక్ష విరమించిన తర్వాత నిరుద్యోగ సమస్య గురించి మాట్లాడతారు.
హుజురాబాద్ లో మరింత హీటెక్కిన పాలిటిక్స్... నిరాహార దీక్షకు దిగిన వైఎస్ షర్మిల (వీడియో)
తెలంగాణలో నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాలని రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేస్తానని షర్మిల ప్రకటించారు. ప్రతి మంగళవారం నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలనే డిమాండ్ తో నిరాహార దీక్ష చేస్తానని ఆమె ప్రకటించారు. అందులో భాగంగానే ఇవాళ కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలో దీక్ష చేపట్టారు షర్మిల.
ఐటిఐ చేసి, డిగ్రీ చదివి, ప్రభుత్వ ఉద్యోగాలకు శిక్షణ తీసుకున్నా కూడా ఉద్యోగం రావడంలేదన్న మనస్థాపంతో హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలోని జమ్మికుంట రైల్వేస్టేషన్ సమీపంలో రైలుకింద పడి మహ్మద్ షబ్బీర్(26) అనే నిరుద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం సిర్సెడు గ్రామానికి చెందిన షబ్బీర్ తొమ్మిది నెలల క్రితం కులాంతర వివాహం చేసుకున్నాడు. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న అతడు స్వరాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం చాలా కాలంగా నిరీక్షించాడు.
ప్రభుత్వ ఉద్యోగాలకు శిక్షణ తీసుకుని కొన్ని రోజులు హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేశాడు. కరోనా కారణంగా ప్రభుత్వం లాక్ డౌన్ విధించడంతో జమ్మికుంట పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో ఉంటున్నాడు. అయితే ఉద్యోగం రావడంలేదని తీవ్ర డిప్రెషన్ కు లోనయిన అతడు కొద్దిరోజులక్రితం జమ్మికుంట రైల్వేస్టేషన్ సమీపంలో తెలంగాణ ఎక్స్ప్రెస్ రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడ్డాడు.