కరోనా విజృంభణ: వైఎస్ షర్మిల కీలక నిర్ణయం

By telugu teamFirst Published Apr 22, 2021, 7:04 AM IST
Highlights

తెలంగాణలో కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో వైఎస్ షర్మిల కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. తాను తలపెట్టిన ఉద్యోగ సాధన రిలే నిరాహార దీక్షలను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురు వైఎస్ షర్మిల కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగ సాధన రిలే నిరాహార దీక్షలను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. 

కోవిడ్ సెకండ్ వేవ్ విస్తరిస్తున్న నేపథ్యంలో ఆ నిర్ణయం తీసుకున్నట్లు వైఎస్ షర్మిల తెలిపారు.  ఆ మరకు ఆమె కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. గత ఆరేళ్ల కాలంలో ఉద్యోగ నియామకాల విషయంలో పాలకుల నిర్లక్ష్యం కారణంగా యువకులు ప్రాణాలు తీసుకుంటున్న పరిస్థితి ఉందని ఆమె అన్నారు. 

నిరుద్యోగుల బాధలకు చలించి, వారికి భరోసా కల్పించాలని ఉద్యోగ సాధన దీక్ష చేపట్టినట్లు ఆమె తెలిపారు. కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా వ్యాపిస్తున్నందు వల్ల కార్యకర్తల, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని బాధ్యత కలిగిన నాయకురాలిగా కొలువుల సాధన దీక్షలను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ఆమె తెలిపారు కొలువులు సాధించే వరకు ఈ పోరాటం కచ్చితంగా కొనసాగుతుందని ఆమె తెలిపారు.

తెలంగాణలో రాజకీయ పార్టీని స్థాపించే ఉద్దేశంతో ఉన్న షర్మిల ఇటీవల ఉద్యోగ సాధన దీక్షను చేపట్టారు. తొలుత హైదరాబాదులోని ఇందిరా పార్కు వద్ద ఒక రోజు దీక్ష చేసిన షర్మిల ఆ తర్వాత తన నివాసం లోటస్ పాండులో దీక్షలను కొనసాగించారు. 

click me!