డిప్రెషన్ తో యువ న్యాయవాది ఆత్మహత్య... గొంతు కోసుకుని తల్లి ఆత్మహత్యాయత్నం...

By SumaBala BukkaFirst Published Jan 12, 2022, 9:42 AM IST
Highlights

ఎంత పిలిచినా అతను బయటికి రాకపోవడంతో స్థానికులు వచ్చి గది తలుపులు పగలగొట్టి లోనికి వెళ్లి చూసేసరికి..  అరవింద్ తన గదిలో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుని కనిపించాడు. అది చూసి తల్లి షాక్ అయ్యింది. సోమవారం రాత్రి వరకు తనతో సంతోషంగా ఉన్న కొడుకు.. ఇక లేడన్న విషయాన్ని జీర్ణించుకోలేని ఆ తల్లి బ్లేడ్ తో గొంతు కోసుకుని ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించింది.  

కరీంనగర్ :  karimnagarలో విషాదం చోటుచేసుకుంది. చదువులో  ప్రథమ శ్రేణిలో..భవిష్యత్తులో ఉన్నతంగా ఉండాలనే ఉద్దేశంతో ఉన్నత విద్య కోసం London వెళ్ళాడు.. సెలవుపై స్వదేశానికి వచ్చి అనారోగ్యంతో బాధపడుతూ తీవ్ర మానసిక వేదనకు గురైన ఓ యువ న్యాయవాది ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తనకు అండగా ఉంటాడనుకున్న కుమారుడు suicide చేసుకోవడంతో.. తట్టుకోలేని ఆ తల్లి ఆత్మహత్యకు ప్రయత్నించింది.

వెంటనే స్పందించిన కుటుంబ సభ్యులు ఆమెను రక్షించడంతో.. ప్రాణాలతో బయటపడింది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం… కరీంనగర్ నగర్ లోని జ్యోతినగర్ కు చెందిన నక్క అరవింద్ ప్రసాద్ (33) కు తండ్రి రాజేశ్వర్ రాజు చిన్నతనంలోనే మృతిచెందాడు. దీంతో.. తల్లి సురేఖనే ఎంతో కష్టపడి కొడుకును పెంచి, పెద్ద చేసింది. అతనికి ఉన్నత చదువులు చదివించింది.  
అరవింద్ కూడా తల్లి ఆశలను నెరవేరుస్తూ చక్కగా చదువుకున్నాడు. న్యాయ విద్యను అభ్యసించాడు. ఆ తరువాత హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశాడు. తెలంగాణ పోలీస్ అకాడమీ గెస్ట్ లెక్చరర్ గా కూడా పని చేశాడు. కొడుకు ఎదుగుదలకు ఆ తల్లి ఎంతో పొంగిపోయేది. ఈ క్రమంలోనే 2 సంవత్సరాల క్రితం  అతనికి వివాహం కూడా అయ్యింది. అయితే కొంతకాలానికే భార్యాభర్తల మధ్య మనస్పర్థలు ఏర్పడటంతో విడిపోయారు. అప్పటినుంచి కాస్త ఇబ్బంది పడేవాడు. 

దాన్నుండి బయటపడడానికి ఆ తర్వాత ఆరు నెలల కిందటే లండన్లో ఎల్ఎల్ఎం విద్యను అభ్యసించడానికి స్టూడెంట్ వీసా మీద వెళ్ళాడు. క్రిస్మస్, న్యూ ఇయర్ సెలవులు రావడంతో పది రోజుల క్రితం ఇండియాకు వచ్చాడు. ప్రస్తుతం సెలవులు పూర్తై మరో మూడు రోజుల్లో తిరిగి లండన్ వెళ్లడానికి తగిన ఏర్పాట్లు చేసుకుని సిద్ధంగా ఉన్నాడు. 

ఈ క్రమంలో హఠాత్తుగా ఏమైందో తెలియదు... కానీ అర్థాంతరంగా జీవితాన్ని ముగించాడు. మంగళవారం ఉదయం ఎప్పట్లాగే..ఇంట్లోని పై అంతస్తులో ఉన్న అరవింద్ గదిలోకి వెళ్లేందుకు తల్లి ప్రయత్నించింది. అయితే ఎప్పుడూ లేనిది అరవింద్ గది తలుపు లోపలి వైపు గడియ పెట్టి ఉంది. దీంతో తల్లి తలుపు కొట్టింది. పిలిచింది. 

అయితే, ఎంత పిలిచినా అతను బయటికి రాకపోవడంతో స్థానికులను పిలిచింది. వారు వచ్చి గది తలుపులు పగలగొట్టి లోనికి వెళ్లి చూసేసరికి..  అరవింద్ తన గదిలో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుని కనిపించాడు. అది చూసి తల్లి షాక్ అయ్యింది. సోమవారం రాత్రి వరకు తనతో సంతోషంగా ఉన్న కొడుకు.. ఇక లేడన్న విషయాన్ని జీర్ణించుకోలేని ఆ తల్లి బ్లేడ్ తో గొంతు కోసుకుని ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించింది.  

కుటుంబ సభ్యులు,  స్థానికులు ఆమెను అదుపు చేశారు. గొంతుపై కోసుకోవడంతో చర్మం తెగడంతో 108 వాహన సిబ్బంది వచ్చి చికిత్స చేశారు. రెండేళ్ళ కిందట  తలకు చిన్న ఆపరేషన్ జరిగిందని,  అప్పుడప్పుడు తల నొప్పి రావడంతో పాటు అనారోగ్యానికి గురవుతున్నానని రాసినట్టుగా ఉన్న ఓ లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.  తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు  టూ టౌన్ పోలీసులు తెలిపారు.

click me!